RTC Bus Strike: మాయమాటలు నమ్మి.. సమ్మె చేయవద్దని కార్మికులు, ఉద్యోగులకు తెలంగాణ ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. ప్రయాణికుల సేవే పరమావధిగా ఆర్టీసీ పనిచేస్తోందన్న ఆయన.. ఇటీవల వివిధ యూనియన్లు ఇచ్చిన సమ్మె నోటీసులపై కార్మిక శాఖ, యాజమాన్యం ఇప్పటికే ఐఏఎస్ అధికారులతో కూడిన కమిటీతో చర్చల ప్రక్రియను ప్రారంభించిందన్నారు.
పారిశ్రామిక వివాదాల చట్టం – 1947లోని సెక్షన్ 22(1)(డీ) ప్రకారం.. సంబంధిత అధికారి వద్ద ఒక వివాదం పెండింగ్లో ఉన్నప్పుడు సమ్మెకు దిగడం చట్టవిరుద్ధం అని ఆర్టీసీ ఎండీ పేర్కొన్నారు. జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ వారి వద్ద ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయని, ఈ ప్రక్రియ ముగియకముందే సమ్మెకు వెళ్లడం చట్టరీత్యా చెల్లదన్నారు. చట్టవిరుద్ధమైన సమ్మెలో పాల్గొనడం వల్ల వేతన కోతతో పాటు, ఉద్యోగ నిబంధనల ప్రకారం కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఇది కార్మికుల భవిష్యత్తుపై, వారి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించారు.
కార్మికుల సంక్షేమం దృష్ట్యా, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడానికి యాజమాన్యం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని తాజా ప్రకటనలో ఆర్టీసీ ఎండీ స్పష్టం చేశారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా, సంస్థ ప్రతిష్ఠను కాపాడవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కార్మికులు, యూనియన్ నాయకులు, పత్రికలు, సోషల్ మీడియాలో వచ్చే అనధికారిక పిలుపులను నమ్మొద్దు అని సూచించారు. సిబ్బంది సమ్మెను విరమించి, అందరూ యథావిధిగా తమ విధులకు హాజరు కావాలని కోరారు. ‘ఆర్టీసీ సంస్థను కాపాడుకుందాం –ప్రజల రవాణా సౌకర్యాన్ని నిరంతరాయంగా కొనసాగిద్దాం’ అని ఎండీ వై. నాగిరెడ్డి పిలుపు నిచ్చారు.
Also Read: సింగరా లేక డబ్బింగ్ ఆర్టిస్టా? లైవ్ కాన్సర్ట్లో అడ్డంగా దొరికిపోయిన దురంధర్ సింగర్ ..వీడియో వైరల్ !