Municipality: తెలంగాణ రాష్ట్రంలో మరొక కొత్త మున్సిపాలిటీ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయ్యింది. వరంగల్ జిల్లాలోని నెక్కొండ మేజర్ గ్రామ పంచాయితీని మున్సిపాలిటీగా మార్చాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులోకి రానున్న నేపథ్యంలో నోటిఫికేషన్ కు ముందే నెక్కొండను మున్సిపాలిటీగా గుర్తించాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
నెక్కొండ మాజీ సర్పంచ్ సొంటిరెడ్డి యమున రెడ్డి ఈ విషయంపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. నెక్కొండ మేజర్ గ్రామ పంచాయితీ విస్తీర్ణం జనాభా దృష్ట్యా దీన్ని మున్సిపాలిటీగా మార్చడం అవసరం అని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు 4త్ సెషన్స్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
నెక్కొండ మున్సిపాలిటీ ఏర్పాటు కోసం ఆరు గ్రామ పంచాయితీలను కలపాలని పిటిషనర్ కోర్టుకు నివేదించారు. నెక్కొండ అమీన్ పేట, గుండ్రపల్లి, పత్తిపాక, నెక్కొండ తండా, టీ.కె తండా గ్రామ పంచాయితీ లను కలిపి కొత్త మున్సిపాలిటీగా ఏర్పాటు చేయాలని కోరారు. పిటిషనర్ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు నెక్కొండకు మున్సిపాలిటీగా అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖను ఆదేశించింది.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ ప్రభావం ఏర్పడక ముందే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాలలో ముఖ్యంగా ప్రస్తావించింది. మున్సిపాలిటీ ఏర్పాటుకు సంబంధించిన నోటిఫికేషన్ ను వెంటనే జారీ చేయాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. హైకోర్టు తాజా ఆదేశాలతో నెక్కొండ ప్రజల కల నెరవేరే దిశగా అడుగులు పడ్డాయి. పరిసర గ్రామాలతో కలిపి నెక్కొండ మున్సిపాలిటీగా మారడం స్థానికుల అభివృద్ధి ఆకాంక్షలకు దక్కిన విజయం అని చెప్పవచ్చు.
తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ హైకోర్టు ఆదేశాలను ఎంత త్వరగా అమలు చేస్తాయి అన్నది చూడాలి. ఈ చర్యతో నెక్కొండ ప్రాంతంలో పరిపాలనా సంస్కరణలు వేగవంతం అయ్యే అవకాశం ఉంది. ఈ కొత్త మున్సిపాలిటీ ఏర్పాటు స్థానిక రాజకీయాలలో ఒక కీలక పరిణామం కానుంది.
ALSO READ: Bandi Sanjay: సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ.. అందులో ఏముందంటే..?