Municipal Elections 2026: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో ఖాళీగా ఉన్న 2,996 వార్డులకు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఎన్నికల కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 19,608 నామినేషన్లు దాఖలయ్యాయి. అభ్యర్థుల నుంచి వచ్చిన దరఖాస్తులను ఇప్పటికే అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన వారి జాబితాను సిద్ధం చేశారు.
అయితే నామినేషన్ల ఉపసంహరణకు నేడే (ఫిబ్రవరి 3) చివరి రోజు కావడంతో అభ్యర్థులు, రాజకీయ పార్టీలలో ఉత్కంఠ నెలకొంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే తమ నామినేషన్లను వెనక్కి తీసుకునేందుకు ఎన్నికల కమిషన్ గడువు ఇచ్చింది. అసమ్మతి నేతలు లేదా రెబల్ అభ్యర్థులను బుజ్జగించేందుకు ప్రధాన పార్టీలు చివరి నిమిషం వరకు ప్రయత్నాలు చేస్తున్నాయి. పోటీలో ఉన్న అదనపు అభ్యర్థులు తప్పుకుంటే గెలుపు అవకాశాలు మెరుగవుతాయని పార్టీలు భావిస్తున్నాయి.
ఉపసంహరణ గడువు ముగిసిన వెంటనే, అధికారులు అభ్యర్థుల తుది జాబితాను అధికారికంగా విడుదల చేస్తారు. ఏ వార్డులో ఎంతమంది పోటీలో ఉన్నారనే విషయంపై నేడు స్పష్టత రానుంది. తుది జాబితా ప్రకటన అనంతరం, స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులను కేటాయించే ప్రక్రియ ప్రారంభమవుతుంది. దీంతో ప్రచార పర్వం ఊపందుకోనుంది. ప్రచారానికి కేవలం కొద్దిరోజులే సమయం ఉండటంతో పార్టీలు ఇంటింటి ప్రచారానికి సిద్ధమవుతున్నాయి.
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 11న ఉదయం నుంచి సాయంత్రం వరకు జరగనుంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వీలుగా ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సుమారు 52.43 లక్షల మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో తమ ప్రతినిధులను ఎన్నుకోనున్నారు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు భారీ పోలీసు బందోబస్తుతో పాటు వెబ్ కాస్టింగ్ వంటి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.
Also Read: తొరూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులకు బీ ఫాంముల పంపిణీ!
పోలింగ్ ముగిసిన అనంతరం, ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు నిర్వహించి అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నారు. ఫిబ్రవరి 16న గెలిచిన వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. అదే రోజు మున్సిపల్ ఛైర్మన్లు, మేయర్ల ఎన్నిక కోసం పరోక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక ప్రభావం చూపే అవకాశం ఉండటంతో అన్ని ప్రధాన పార్టీలు వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు నేడే చివరి రోజు
నామినేషన్ల ఉపసంహరణకు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలోని 2,996 వార్డులకు 19,608 నామినేషన్లు దాఖలు
ఫిబ్రవరి 11న జరగనున్న పోలింగ్
నామినేషన్ల ఉపసంహరణ అనంతరం… pic.twitter.com/vrfSbsNxbB
— BIG TV Breaking News (@bigtvtelugu) February 3, 2026