Thorrur Municipality: పాలకుర్తి, స్వేచ్ఛ : తొరూరు మున్సిపాలిటీలోని 16 వార్డులకు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు బీ–ఫాంములను అధికారికంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు అభ్యర్థులకు బీ–ఫాంములను అందజేసి, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం లక్ష్యంగా ఐక్యంగా పనిచేయాలని సూచించారు. ప్రజా సమస్యలను గడపగడపకు తీసుకెళ్లడంతో పాటు, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ తొరూరు మున్సిపాలిటీ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన దృష్టికోణంతో ముందుకు సాగుతోందని అన్నారు. ప్రజల ఆశీర్వాదాలతో ఈ ఎన్నికల్లో అన్ని వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ బలపరిచిన అభ్యర్థులందరూ సమన్వయంతో పనిచేసి ప్రజల మద్దతు పొందాలని కోరారు.
అనంతరం టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడే పార్టీ అని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే నిబద్ధతతో పనిచేస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని తెలిపారు. అభ్యర్థులందరూ సమర్థవంతమైన ప్రచారం నిర్వహించి విజయాన్ని సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహభరిత వాతావరణాన్ని నెలకొల్పారు. తొరూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, ఈ ఎన్నికల్లో పార్టీ విజయం ఖాయమని నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు.
Also Read: Medaram Jatara: మేడారం మహా జాతర ఖర్చు వెయ్యి కోట్లు!.. మద్యం, మాంసానికే రూ.400 కోట్లట!