Elephant Attack: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో ఏనుగుల గుంపు మరోసారి బీభత్సం సృష్టించింది. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో సంచరిస్తున్న గజరాజులు.. తాజాగా శివన్నపేట, మాదలంగి గ్రామాల్లోని పంట పొలాలపై విరుచుకుపడ్డాయి. దీంతో పంటలను తొక్కి ధ్వంసం చేయడంతో రైతులకు భారీగా నష్టం వాటిల్లింది.
ఏడాది పొడవునా కష్టపడి సాగు చేసిన పంటలు చేతికి వచ్చే సమయంలో ఏనుగుల దాడికి గురవ్వడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ‘పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు’ అని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని.. నష్టపోయిన తమను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఏనుగుల సంచారంపై సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామస్థులను అప్రమత్తం చేస్తూ.. పొలాల వైపు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. టపాసులు పేలుస్తూ, డప్పు వాయిద్యాల సహాయంతో ఏనుగులను అటవీ ప్రాంతంలోకి తరిమికొట్టేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఏనుగులు గ్రామాల సమీపంలోనే తలదాచుకోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనల మధ్య గడుపుతున్నారు.