Municipal Elections 2026: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగనున్న నేపథ్యంలో, రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) ఓటర్ల జాబితా రూపకల్పనలో కీలక ఘట్టాన్ని పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ ముగిసినట్లు ఎస్ఈసీ అధికారికంగా ప్రకటించింది. మొత్తం 2,996 వార్డుల్లో ఓటర్ల నిర్ధారణ పూర్తయిందని, దీని ప్రకారం మున్సిపల్ పరిధిలో మొత్తం 52.43 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించింది.
ఈ ఓటర్ల గణాంకాలను పరిశీలిస్తే, పురుషుల కంటే మహిళా ఓటర్లే ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. రాష్ట్ర మున్సిపాలిటీల్లో పురుష ఓటర్లు 25.62 లక్షలు ఉండగా, మహిళా ఓటర్లు 26.80 లక్షల మంది ఉన్నారు. అంటే పురుషుల కంటే దాదాపు 1.18 లక్షల మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. ఇక ఇతర కేటగిరీ (థర్డ్ జెండర్) ఓటర్లు 640 మందిగా నమోదయ్యారు.
మున్సిపల్ కార్పొరేషన్ల వారీగా చూస్తే, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అత్యధికంగా 3,48,051 ఓటర్లతో మొదటి స్థానంలో నిలిచింది. దీని తర్వాతి స్థానాల్లో కరీంనగర్ (3,40,580), మహబూబ్నగర్ (1,97,841), రామగుండం (1,83,049) మరియు మంచిర్యాల (1,81,778) కార్పొరేషన్లు ఉన్నాయి. కాగా, అత్యల్పంగా ములుగు జిల్లాలోని ములుగు మున్సిపాలిటీలో కేవలం 13,963 మంది ఓటర్లు మాత్రమే ఉన్నట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఓటర్ల మ్యాపింగ్ పూర్తి కావడంతో, త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Read Also: ‘తెలంగాణ మోడల్’ పాలనే మా లక్ష్యం.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు!