Mahesh Kumar Goud: గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో 90 శాతం కాంగ్రెస్ అభ్యర్ధులే విజయం సాధించబోతున్నట్టు చెప్పారు.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మా స్వగ్రామంలోనూ సర్పంచ్ పదవి ఏకగ్రీవం అయ్యిందనీ.. గ్రామాల్లో మరిన్ని ఏకగ్రీవాలు పెరుగుతాయని అన్నారాయన. ఇక గ్లోబల్ సమ్మిట్ అనుకున్న దానికంటే ఎక్కువ పెట్టుబడులు సాధిస్తోందని అన్నారు. రాష్ట్రానికిది శుభ సూచికంగా దీన్ని భావిస్తున్నట్టు చెప్పారు మహేష్ గౌడ్. దూరదృష్టితో సీఎం రేవంత్ ఫ్యూచర్సిటీ నిర్మిస్తున్నారనీ.. ఎన్నో పెద్ద పెద్ద సంస్థలు ఇక్కడి పెట్టుబడులు పెట్టడానికి పోటీ పడుతున్నట్టు చెప్పారు మహేష్ గౌడ్. ప్రపంచ దేశాలు నివ్వెర పోయేలా.. గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్నట్టు చెప్పుకొచ్చారాయన.
సీఎం రేవంత్ రెడ్డి రూపొందిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ (Future City) ప్రాజెక్టుపై ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, ఇది తెలంగాణ అభివృద్ధి పథకంలో మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఆధునిక మౌలిక సదుపాయాలతో, ప్రపంచ స్థాయి సాంకేతికతతో కూడిన ఈ ఫ్యూచర్ సిటీకి అనేక అంతర్జాతీయ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు.
ఈ సమ్మిట్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది వేస్తుందని, భవిష్యత్తు ఉద్యోగావకాశాలకు పెద్ద దిక్సూచి అవుతుందని వ్యాఖ్యానించారు.
ప్రతి జిల్లాలో తెలంగాణ తల్లి విగ్రహాల ప్రతిష్టాపనపై స్పందిస్తూ, ఇది తెలంగాణ ప్రజల గౌరవానికి ప్రతీక అని, ఈ నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారని ఆయన అన్నారు. అయితే బీఆర్ఎస్ పది సంవత్సరాలు అధికారంలో ఉన్నా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. తెలంగాణ సాంప్రదాయం, గౌరవం, స్వాభిమానాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నప్పుడు, ఎందుకు విగ్రహాన్ని ప్రతిష్టించలేకపోయారో అడగాలని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమ గీతం అయిన ‘జయ జయహే తెలంగాణ’ను అధికారంలో ఉన్న బీఆర్ఎస్ గౌరవించలేదని, దానిని విస్మరించి చరిత్రలో తప్పు చేశారని మహేష్ గౌడ్ విమర్శించారు. టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్గా మారినా ప్రజల్లో ప్రభావం కోల్పోయిందని, బీఆర్ఎస్ పార్టీ ఖేల్ ఖతం దుకాణం బంద్ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Also Read: ఉస్మానియా యూనివర్సిటీకి రూ.1000 కోట్ల కేటాయింపు.. రేపు సీఎం రేవంత్రెడ్డి ప్రకటన
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ చేసిన చారిత్రక నిర్ణయాన్ని గుర్తు చేశారు. సోనియా గాంధీ సంకల్పం లేకపోతే తెలంగాణ కల సాకారమయ్యేదేమీ కాదని చెప్పారు. ఆ సమయంలో బీఆర్ఎస్కు ఉన్న ఇద్దరు ఎంపీలు మాత్రమే పోరాడితే రాష్ట్రం వచ్చేదా? అని ప్రశ్నించారు. యూపీఏ ప్రభుత్వం మొత్తం కలిసి పోరాడినందువల్లే తెలంగాణ ఆవిర్భవించిందని మహేష్ గౌడ్ పేర్కొన్నారు.