బీఆర్ఎస్, బీజేపీ నేతలపై టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన పరిణామాలు, ఎన్నికల ఫలితాలు, సంక్షేమ పథకాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
కవిత ప్రశ్నలకు సమాధానం ఏది..?
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావులపై మహేష్ కుమార్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కవిత చేసిన వ్యాఖ్యలతో కేటీఆర్కు సిస్టర్ స్ట్రోక్, హరీష్ రావుకు మరదల్ స్ట్రోక్ తగిలి వారిద్దరికీ మతిభ్రమించిందని ఎద్దేవా చేశారు. అవినీతి, పార్టీ పేరు మార్పుపై కవిత లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వారు నీళ్లు నములుతున్నారని అన్నారు. దమ్ముంటే ఆమె అడిగిన ప్రశ్నలకు అన్న, బావలు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు.
ఎన్నికల విజయాలు – ప్రజా పాలనకు నిదర్శనం
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు 70 శాతానికి పైగా స్థానాలను కైవసం చేసుకున్నారని ఆయన వెల్లడించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 25 వేల భారీ మెజార్టీతో విజయం సాధించడం కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ప్రజా పాలన, అభివృద్ధి, సంక్షేమానికి నిదర్శనమని పేర్కొన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా 90 శాతం స్థానాలను కైవసం చేసుకుంటామని అన్నారు. పక్కా ప్రణాళికతో, ఎలాంటి సమన్వయ లోపం లేకుండా బరిలోకి దిగుతామని ధీమా వ్యక్తం చేశారు. అయితే, పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ రెబల్స్ వల్ల కొన్ని చోట్ల నష్టం జరిగిందని.. దానివల్ల బీఆర్ఎస్, బీజేపీలు లబ్ధి పొందాయని ఆయన విశ్లేషించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్యం, క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, సన్న బియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు వంటి అనేక పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నట్లు వివరించారు. అలాగే.. ఏఐసీసీ నేతలు ఖర్గే, రాహుల్ గాంధీ పిలుపు మేరకు రాష్ట్రంలో శాస్త్రీయంగా కుల సర్వే నిర్వహించామని గుర్తు చేశారు. నిరుద్యోగుల ఉసురు తగలడం వల్లే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిందని అన్నారు. గత పాలనలో ఇచ్చిన ఉద్యోగాల సంఖ్యపై చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. కేటీఆర్ ఒక రియల్టర్ లా మారి హైదరాబాద్ భూములను అమ్మేశారని ఆరోపించారు.
బీజేపీ నేతలు జిల్లాల పేర్లు మార్చడం వంటి అనవసర విషయాల కంటే.. తాము చేసిన అభివృద్ధి గురించి మాట్లాడాలని హితవు పలికారు. దేవుడి పేరును వాడుకునే హక్కు బీజేపీకి ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఇదే క్రమంలో.. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా వస్తున్న తప్పుడు వార్తా కథనాలను ఆయన ఖండించారు. వాస్తవాలకు దూరంగా ఉండే వార్తలు ఎవరికీ శ్రేయస్కరం కాదని హితవు పలికారు. సామాన్యులకు సినిమా టికెట్లు అందుబాటు ధరలో ఉండాలని ఆయన ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.