TG Municipal Elections: మరో ఎన్నికల సంగ్రామానికి రెడీ అయింది తెలంగాణ. మొన్నే.. పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేసుకుంది రాష్ట్ర ఎన్నికల సంఘం. తాజాగా మున్సిపల్ పోరుకు సైతం షెడ్యూల్ ప్రిపేర్ చేస్తోంది. రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. జనవరి 17వ తేదీ తర్వాత ఏ క్షణమైనా షెడ్యూల్ నోటిఫికేషన్ వెలువడనుంది.
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతోంది. ఇప్పటికే జిల్లాల కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, మున్సిపాలిటీ, కార్పొరేషన్ల కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈ నెల 12న తుది ఓటర్ల జాబితా, 13న పోలింగ్ స్టేషన్ల వివరాల ముసాయిదా జాబితా ప్రచురించి, వాటిని ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టి-పోల్ యాప్లో అప్లోడ్ చేయనుంది ఎస్ఈసీ. అదే విధంగా జనవరి 16వ తేదీన పోలింగ్ స్టేషన్ల వివరాలతో పాటు ఫొటోతో కూడిన ఓటర్ ఫైనల్ లిస్ట్, ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా విడుదల చేయనున్నారు. దీంతో పాటు బ్యాలెట్ బాక్స్ లు, ఎన్నికల అధికారులు, సిబ్బంది నియామకానికి ఉద్యోగుల వివరాలను టి-పోల్లో అప్డేట్ చేయాలని రాణి కుముదిని ఆదేశించారు.
ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్ల పై ఇటు అధికార- రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను, రాష్ట్రంలో కులగణన కోసం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ ప్రతిపాదనల ఆధారంగా బీసీ రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. మున్సిపాలిటీలలో సాధారణంగా ఎస్సీ, ఎస్టీ జనాభా తక్కువగా ఉంటుంది. మొత్తం జనాభాలో వీరి వాటా ప్రకారం రిజర్వేషన్లు కేటాయిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత బీసీ రిజర్వేషన్లు కంప్లీట్ చేస్తారు. 2020లో జరిగిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 14 శాతం ఎస్సీలు, 3 శాతం ఎస్టీలు, 33 శాతం బీసీ జనాభా ఉన్నట్లు గుర్తించి దాని ఆధారంగానే తుది రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఎస్సీ, ఎస్టీలకు నిర్ణయించిన తర్వాత మిగతా వాటిని మొత్తం రిజర్వేషన్లు 50 శాతం పరిమితికి లోబడి బీసీలకు కేటాయిస్తారు. మొత్తం స్థానాల్లో 50 శాతం మహిళలకు కేటాయిస్తారు. రిజర్వేషన్ ప్రకారం ఏ సామాజిక వర్గానికి కేటాయించినప్పటికీ, అందులో మళ్లీ సగం స్థానాలు మహిళలకే దక్కనున్నాయి.
రాష్ట్రంలో గడువు ముగిసిన 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్ల ఎన్నికలకు ఒకే దశలో ఎన్నికలు జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 17వ తేదీ తర్వాత ఏ క్షణమైనా ఎలక్షన్ షెడ్యూల్ విడుదల అవ్వనుంది. ఫిబ్రవరి రెండో వారంలోపు ఎన్నికలను పూర్తి చేసేందుకు సన్నాహం చేస్తోంది ఎస్ఈసీ. ఇక మిగిలిన 4 మున్సిపాలిటీలతో పాటు జీహెచ్ఎంసీలో సైతం ప్రస్తుతం జరుగబోయే ఎన్నికల నుంచి మినహాయింపు ఇచ్చింది ఈసీ. ఓఆర్ఆర్ రోడ్డు పరిధిలోని మున్సిపాలిటీలను విలీనం చేయడం వల్ల జీహెచ్ఎంసీతో కలిసి ఆ ఎన్నికలు జరగనున్నాయి.
ALSO READ:సొంతూళ్లకు వెళ్తున్నారా? ఈ రూట్లలో భారీగా ట్రాఫిక్ జామ్.. ఈ మార్గాలు బెటర్