Delhi Liquor Scam : దేశవ్యాప్తంగా ఢిల్లీ మద్యం కుంభకోణం సంచలనం సృష్టించింది. ఈ కుంభకోణంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు ప్రధానంగా వినిపించింది. బీజేపీ నేతలు కవితను టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేశారు. ఆమె విచారణ ఎదుర్కొంటారంటూ లీకులిచ్చారు. కవిత సన్నిహితుల ఇళ్లపై, కార్యాలయాలపై ఈడీ దాడులు జరిపింది. ఇలా టీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ మైండ్ గేమ్ ఆడింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఇప్పడు ఇదే స్ట్రాటజీని బీజేపీపై టీఆర్ఎస్ ప్రయోగిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాం వర్సెస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో టీఆర్ఎస్ ను బీజేపీ టార్గెట్ చేయాలని ప్రయత్నించింది. లిక్కర్ కుంభకోణంలో కవిత పాత్రపై ఆధారాలు ఉన్నాయి అంటూ బీజేపీ నేతలు పదే పదే ప్రకటనలు గుప్పించారు. కవిత కచ్చితంగా విచారణను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. అయితే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత పాత్ర ఏ మేరకు ఉందో ఇప్పటి వరకు బయటకు రాలేదు. కానీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఏదో జరగబోతోంది అన్న చర్చ మాత్రం జోరుగా సాగుతోంది. ఈ పరిణామాలు టిఆర్ఎస్ కు రాజకీయంగా ఇబ్బందిగా మారాయి. ఆధారాలు ఉన్నాయని పదేపదే చెప్పడం, కవితకు సన్నిహితంగా ఉన్న వారిని దర్యాప్తు సంస్థలు ప్రశ్నించడంతో టీఆర్ఎస్ ఆత్మరక్షణలో పడిపోయింది.
ఇప్పుడు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం టీఆర్ఎస్ కు ఆయుధంగా మారింది. ఈ వ్యవహారంలో బీజేపీ కీలక నేతలను టార్గెట్ చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది గులాబీ పార్టీ. నాటకీయ ఫక్కీలో సాగిన ఈ వ్యవహారంలో 2 ఆడియోలను రిలీజ్ చేసి పక్కా ఆధారాలు తమ వద్ద ఉన్నాయని టిఆర్ఎస్ మైండ్ గేమ్ మొదలుపెట్టింది. పక్కా ఆధారాలు ఉంటే ఇప్పటికే బయటపెట్టాలి. ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారం జరిగిందనడానికి బలమైన ఆధారాలు ఉంటే సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి. అలా కాకుండా ఏ విధంగా ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో బీజేపీ మైండ్ గేమ్ ఆడుతోందో అదే తరహాలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో టీఆర్ఎస్ మైండ్ గేమ్ ఆడుతున్నట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్, ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం కేసులు ఎప్పటికి తేలతాయో చూడాలి మరి. ఇలాంటి వ్యవహారాల్లో క్లాప్ కొట్టడమే కానీ ఎండ్ కార్డులు ఉండవని గతంలో అనేక కేసుల్లో రుజువైంది.