తెలంగాణలో భానుడు భగభగ మండిపోతున్నాడు. మార్చి ఆరంభంలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల దిశగా దూసుకుపోతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ఎండలు ఏ రేంజ్ లో కొడుతున్నాయో… ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల్లో ఒంటిపూట బడులు నిర్వహించాలని విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ గురువారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నెల 15వ తేదీ నుంచి ఏప్రిల్ 23 వరకు హాఫ్ డే స్కూల్స్ కొనసాగుతాయి. మార్చి 15 ఆదివారం కావడంతో ఈ నిబంధనలు మార్చి 16 సోమవారం నుంచి క్షేత్రస్థాయిలో అమల్లోకి రానున్నాయి. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ఎయిడెడ్, ప్రైవేటు విద్యాసంస్థలు సైతం ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. సమయపాలన విషయంలో విద్యాశాఖ స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు తరగతులు ప్రారంభమై మధ్యాహ్నం 12:30 గంటలకు ముగుస్తాయి.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్నం 12:30 గంటలకు యథావిధిగా మధ్యాహ్న భోజనం అందజేస్తారు. భోజనం ముగిసిన వెంటనే విద్యార్థులను ఇళ్లకు పంపించేలా ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలి. ఎండల తీవ్రత పెరగకముందే పిల్లలు సురక్షితంగా నివాసాలకు చేరుకునేలా ఈ టైమ్ టేబుల్ రూపొందించారు. తాగునీటి సౌకర్యం, నీడ వంటి కనీస వసతుల విషయంలో రాజీ పడకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణ దృష్ట్యా కొన్ని ప్రత్యేక మినహాయింపులు ఇచ్చారు. టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ జరిగే కేంద్రాల్లో పరీక్షలు ఉన్న రోజుల్లో మాత్రం పాఠశాలల పనివేళలు మారుతాయి. అటువంటి పాఠశాలలు మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయి. అదేవిధంగా పరీక్షలకు సిద్ధమవుతున్న పదో తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు కొనసాగుతాయి. సిలబస్ రివిజన్ తో పాటు పరీక్షల సన్నద్ధతపై ఉపాధ్యాయులు విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులు (DEOs) ఈ ఉత్తర్వులను పక్కాగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించే ప్రైవేటు పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. విద్యార్థులు వడదెబ్బ బారిన పడకుండా పాఠశాల ఆవరణలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు సైతం అప్రమత్తంగా ఉండాలని విద్యాశాఖ కోరింది.
ALSO READ: Police Recruitment: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. రాష్ట్రంలో 17,992 పోలీస్ వెకెన్సీలు