తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ (SIT) విచారణ అత్యంత వేగంగా కొనసాగుతోంది. ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న వారిని సిట్ అధికారులు లోతుగా విచారిస్తున్నారు. ముఖ్యంగా మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకు కోర్టు విధించిన 14 రోజుల కస్టోడియల్ విచారణ నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే.. గడిచిన రెండు రోజులుగా ప్రభాకర్ రావును, మరో కీలక నిందితుడు ప్రణీత్ రావును కలిపి అధికారులు విచారించినట్లు సమాచారం. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణలు, ఫోన్ ట్యాపింగ్ ఆదేశాల వెనుక ఉన్న అసలు సూత్రధారులపై అధికారులు కీలక సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది.
మరోవైపు.. ఈ విచారణలో భాగంగా ప్రభాకర్ రావు పెద్ద కుమారుడు నిశాంత్ రావును కూడా సిట్ అధికారులు విచారించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కేసులో జరిగిన ఆర్థిక లావాదేవీలపై అధికారులకు కొన్ని అనుమానాలు ఉండటంతో.. నిశాంత్ రావు స్టేట్మెంట్ను రికార్డు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏదైనా నిధుల మళ్లింపు జరిగిందా..? లేదా ఇతర ఆర్థిక ప్రయోజనాలు పొందారా? అనే కోణంలో అధికారులు ఆయన్ని ప్రశ్నించారు. ఈ విచారణ ద్వారా కొన్ని కీలక ఆధారాలు లభించినట్లు సిట్ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రస్తుతం మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధకిషన్ రావు, అడిషనల్ ఎస్పీ తిరుపతన్నతో పాటు మీడియా సంస్థ అధినేత శ్రవణ్ రావును కూడా సిట్ బృందం విచారిస్తోంది. శ్రవణ్ రావుకు ఈ కేసులో ఉన్న ప్రమేయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రణీత్ రావు మినహా మిగిలిన నిందితులందరినీ ఒకే చోట చేర్చి విచారిస్తున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఎవరి ఫోన్లు ట్యాప్ చేశారు..? డేటా ఎక్కడ భద్రపరిచారు..? అనే అంశాలపై స్పష్టత పొందేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
కస్టడీ గడువు ముగియడంతో ప్రభాకర్ రావును నేడు తిరిగి కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ 14 రోజుల విచారణలో సేకరించిన సమాచారాన్ని నివేదిక రూపంలో సిట్ అధికారులు కోర్టుకు సమర్పించే అవకాశం ఉంది. ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందన్న ప్రచారం రాజకీయ, పోలీస్ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.
ALSO READ: Amit Shah: 2026 మార్చి 31వ తేదీలోగా నక్సలిజం నిర్మూలిస్తాం.. ఒడిశా ఎన్కౌంటర్పై అమిత్ షా రియాక్షన్