MLA Disqualification Case: తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శుక్రవారం జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవడంలో జరుగుతున్న జాప్యంపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఇప్పటికే తగిన సమయం ఇచ్చామని, ఈపాటికి ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉండాల్సిందని ధర్మాసనం పేర్కొంది. స్పీకర్కు ఇదే చివరి అవకాశమని స్పష్టం చేసింది. ఇకనైనా నిర్ణయం తీసుకోకపోతే తగిన పరిణామాలు ఉంటాయని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఇప్పటికే కొందరికి క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో, మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేల విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ముగ్గురు ఎమ్మెల్యేలపై తీసుకున్న చర్యలకు సంబంధించి రెండు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని స్పీకర్ను కోర్టు ఆదేశించింది.
విచారణ సందర్భంగా స్పీకర్ తరపు న్యాయవాదులు.. ముగ్గురు ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేయడానికి నాలుగు వారాల సమయం కావాలని కోరారు. అయితే, రెండు వారాల్లో ప్రగతి చూపిస్తేనే, మిగిలిన నాలుగు వారాల సమయం గురించి ఆలోచిస్తామని సుప్రీంకోర్టు తెల్చిచెప్పింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
Read Also: ప్రియుడితో కలిసి హోటల్లో.. భర్తకి చిక్కిన భార్య, చివరకు భర్తపై చిందులు, వీడియో వైరల్