Mahesh Kumar Goud: స్వేచ్ఛ, బ్యూరో: టీపీసీసీ చీఫ్ జిల్లా పర్యటనలు మొదలు పెట్టారు. ఆదివారం యాదాద్రి, సిద్దిపేట్ జిల్లాల్లో పర్యటించారు.ఏఐసీసీ ఆదేశాల మేరకు జిల్లా పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 25న మాత్రం మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. అసెంబ్లీ సమావేశాలు అనంతరం కొత్త జిల్లాలు వారీగా పర్యటనలు చేయనున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై కాంగ్రెస్ హైకమాండ్ ప్రత్యేక దృష్టి సారించింది. దీంతోనే ఏఐసీసీ ఆదేశాల మేరకు టీపీసీసీ అధ్యక్షులు కొత్త జిల్లాల వారీగా సుడిగాలి పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారు. ఈ పర్యటనల ద్వారా అటు ప్రభుత్వం, ఇటు పార్టీ శ్రేణుల మధ్య సమన్వయాన్ని పెంచనున్నారు. వాస్తవానికి ఈ జిల్లా పర్యటనలు చేయాలని టీపీసీసీ చీఫ్ గతంలోనే ప్లాన్ చేశారు. అయితే డీసీసీ పరిధిలోని కమిటీలు ఏర్పాటు కాకపోవడంతో టూర్ పెండింగ్ పడింది. తాజాగా 14 డీసీసీల పరిధిలో కమిటీలు వేశారు. సెక్రటరీ, జనరల్ సెక్రటరీలు, ట్రెజరర్స్, మెంబర్లను నియమించారు. దీంతో ఆయా జిల్లాల్లో పర్యటించి కొత్త కమిటీలతో మీటింగ్ లను కూడా నిర్వహించనున్నారు.
Also Read: Cyber Fraud Alert: సైబర్ మోసాల కొత్త ట్రిక్.. ఒక్క మెసేజ్తో బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం!
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతులపై నేరుగా ప్రజల నుంచే ఫీడ్బ్యాక్ సేకరించేందుకు పీసీసీ చీఫ్ తన షెడ్యూల్ ను రూప కల్పన చేశారు. అంతేగాక ఎన్నికల తర్వాత క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ జోష్ ఎలా ఉంది? నాయకుల మధ్య సమన్వయం ఎలా ఉన్నదనే అంశాలపై అంతర్గత సమావేశాలు నిర్వహిస్తారు. దీంతో పాటు వార్డు సభ్యులు, సర్పంచ్ల నుంచి జిల్లా స్థాయి నేతల వరకు అందరినీ ఒకే తాటిపైకి తెచ్చి, రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయనున్నారు. అంతేగాక ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలు, ఇతర సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందుతున్నాయా లేదా అని పరిశీలించి, వాటి ప్రచార బాధ్యతను కార్యకర్తలకు అప్పగించనున్నారు. గ్రామ స్థాయిలోనే ప్రత్యేకంగా పార్టీ తరపున కమిటీలు కూడా వేయనున్నట్లు సమాచారం. ఢిల్లీ పెద్దల ఆదేశాల మేరకు ఈ పర్యటనలు కేవలం రాజకీయ సభలుగా కాకుండా, ప్రభుత్వ పనితీరును పరిశీలించేందుకు కూడా పార్టీ నేతలతో సమీక్షలు నిర్వహించనున్నారు.ప్రతి జిల్లా పర్యటన ముగిశాక ఒక సమగ్ర నివేదికను టీ పీసీసీ హైకమాండ్కు సమర్పించనున్నారు.
ఇక ప్రభుత్వం, పార్టీలో ఏప్రిల్ నెలలో పదవులు పంపిణీ చేసేందుకు గాంధీభవన్ కు జిల్లాల వారీగా లిస్టు వచ్చింది. ఈ లిస్టులోని అభ్యర్ధులతోనూ టీపీసీసీ చీఫ్ నేరుగా మాట్లాడనున్నారు. పార్టీలో పనితీరు, అభ్యర్ధిత్వంపై క్షేత్రస్థాయి కార్యకర్తల నుంచి వస్తున్న మద్ధతు, ప్రజల్లో రెస్పాన్స్ వంటి అంశాలను పరిశీలించనున్నారు. పదేళ్ల పవర్ ను పొందాలంటే తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, లీడర్ల మద్ధతు అవసరం . దీంతోనే గ్రౌండ్ లెవల్ లో పార్టీని మరింత బలోపేతం చేయాలని టీపీసీసీ చీఫ్ భావిస్తున్నారు. ప్రభుత్వం, పార్టీకి మంచి మైలేజ్ వచ్చేలా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తన టూర్ లో ప్రత్యేకమైన వ్యూహాన్ని అమలు చేయనున్నారు.