Mandula Samuel: తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ తాజాగా జరిగిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఎమ్మెల్సీ కవితపై నిప్పులు చెరిగారు. రాజకీయంగా ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఆయన తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. సామెల్ విమర్శల్లో ప్రధానంగా కుటుంబ రాజకీయాలు, జైలు శిక్ష, కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలను ఎండగట్టారు.
కుటుంబ కలహాలు – తీహార్ జైలు ప్రస్తావన..
మందుల సామెల్ మాట్లాడుతూ.. కేటీఆర్కు తన చెల్లెలు కవిత ‘రేగు కంప’లా తయారైందని ఎద్దేవా చేశారు. కవిత పార్టీ ఎందుకు పెట్టిందో, తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేటీఆర్ పైన ఉందన్నారు. ‘మేము పదేళ్లు ఏమీ చేయలేదా?’ అని ప్రశ్నిస్తున్న కవిత, మరి ఏ తప్పూ చేయకపోతే తీహార్ జైలుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో వివరించాలని డిమాండ్ చేశారు. అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లిని కాదని, కవితకు ఎమ్మెల్సీ పదవి ఎలా ఇచ్చారో ప్రజలందరూ గమనిస్తున్నారని ఆయన గుర్తు చేశారు.
గుర్తింపు రాజకీయాలు..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎవరూ గుర్తుపట్టడం లేదన్న కేటీఆర్ వ్యాఖ్యలకు సామెల్ ఘాటుగా స్పందించారు. ‘కేసీఆర్ను ప్రజలు గుర్తుపడతారు కానీ, నిన్ను ఎవరు గుర్తుపడతారు కేటీఆర్?’ అని ప్రశ్నించారు. కేటీఆర్ ఎక్కడ తిరుగుతారో, ఆయన్ని ఎవరెవరు గుర్తుపడతారో తనకు బాగా తెలుసంటూ పరోక్షంగా చురకలు అంటించారు. మీ పక్కన ఉన్నవారే గుంటనక్కలు, తోడేళ్లని, మీ ఇంటి గొడవలు మీరు చూసుకోకుండా వేరే వాళ్ల జోలికి ఎందుకు వస్తున్నారని నిలదీశారు.
కాంగ్రెస్ బలం – ఆర్టీసీ ఇష్యూ..
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కదిలించే దమ్ము ఎవరికీ లేదని, రాబోయే పదేళ్ల వరకు ఈ ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుందని సామెల్ ధీమా వ్యక్తం చేశారు. ఆర్టీసీని ఇబ్బంది పెట్టి ప్రభుత్వంపై అపవాదు తీసుకురావాలని బీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని, కానీ రేవంత్ రెడ్డి ‘డేగ కన్ను’ వేసి ప్రతి కదలికను గమనిస్తున్నారని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో ఇప్పుడున్న సీట్లు కూడా బీఆర్ఎస్కు రావని, కేటీఆర్ పతనం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.
Also Read: ఓయూలో కలకలం.. లేడీస్ హాస్టల్ ఎదుట మైనింగ్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం!