Hyderabad News: పులి గోర్లు దంతాలను అమ్మటానికి యత్నించిన ఇద్దరిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు వలపన్ని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ఏడు పులి గోర్లు, మూడు కేనైన్ దంతాలను స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. నాంపల్లిలోని హోటల్ ఏషియన్ ఇంటర్నేషనల్ లో ఉంటూ ఇద్దరు వ్యక్తులు పులి గోర్లు, దంతాలను అమ్మటానికి ప్రయత్నిస్తున్నట్టుగా డీఆర్ఐ అధికారులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో అధికారులు ఇద్దరు కొనుగోలుదారుల్లా ఆ హోటల్ కు వెళ్లారు. నిందితులతో బేరసారాలు సాగించి పులి గోర్లు, దంతాలను చూపించమన్నారు. ఓ ప్లాస్టిక్ కవర్ లో ఉన్న వాటిని నిందితులు బయటకు తీయగానే బయట ఉన్న సహచరులకు సమాచారం ఇచ్చారు.
Also Read: GHMC: జీహెచ్ఎంసీలో స్పెషలాఫీసర్ పాలన షురూ.. 13 తర్వాతే మూడు కార్పొరేషన్లపై క్లారిటీ!
ఆ వెంటనే మిగితా అధికారులు దాడి చేసి నిందితులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పులి గోర్లు, దంతాలను స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న ఇద్దరు నిందితులను తదుపరి దర్యాప్తు నిమిత్తం హైదరాబాద్ సెంట్రల్ ఫారెస్ట్ రేంజ్ అధికారికి అప్పగించారు. విచారణలో ఇద్దరు నిందితులు కేరళ రాష్ట్రానికి చెందిన వారని వెల్లడైంది. తమ సన్నిహిత మిత్రుడైన జకరియా అనే వ్యక్తి నుంచి పులి గోర్లు, దంతాలు తీసుకుని అమ్మటానికి హైదరాబాద్ వచ్చినట్టుగా స్పష్టమైంది. నిందితులు ఇద్దరిపై వన్యప్రాణి సంరక్షణా చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు. మంగళవారం ఇద్దరిని కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం రిమాండ్ విధించటంతో చెంచల్ గూడ జైలుకు తరలించారు.
జాతీయ జంతువైనపులి సెడ్యూల్ 1 కేటగిరీలోకి వస్తుందని అటవీశాఖ అధికారులు తెలిపారు. దీని ప్రకారం పులి అత్యంత రక్షిత జాతి అని పేర్కొన్నారు. పులి శరీర భాగాలను కలిగి ఉండటం, వాటి వ్యాపారం చేయటం చట్టరీత్యా నేరమని తెలిపారు. ఈ కేసుల్లో శిక్షలు కఠినంగా ఉంటాయన్నారు.
Also Read: GHMC: జీహెచ్ఎంసీలో స్పెషలాఫీసర్ పాలన షురూ.. 13 తర్వాతే మూడు కార్పొరేషన్లపై క్లారిటీ!