Utham Kumar Reddy: తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జల్ శక్తి మంత్రి మరియు సీడబ్ల్యూసీ (CWC) చైర్మన్తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న పలు సాగునీటి ప్రాజెక్టులు, నిధుల కేటాయింపు, జలాల పంపకాలపై వారితో సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా అత్యంత వెనుకబడిన ప్రాంతంలో ఉన్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు ట్రిబ్యునల్ కేటాయింపుల కోసం ఎదురుచూడకుండా, మైనర్ ఇరిగేషన్ అవసరాల నిమిత్తం తక్షణమే 45 టీఎంసీల నీటిని కేటాయించాలని మంత్రి డిమాండ్ చేశారు. అలాగే, సమ్మక్క-సారక్క ప్రాజెక్టు పనులు పూర్తయినందున దానికి సంబంధించిన TAC మరియు ITC అనుమతులు వెంటనే మంజూరు చేయాలని కోరారు.
నీటిపారుదల రంగానికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తోందని తెలిపిన ఉత్తమ్, కేంద్రం నుంచి మరింత ఆర్థిక చేయూతను కోరారు. ప్రాణహిత చేవెళ్ల, సీతారామ, పాలమూరు-రంగారెడ్డి, చిన్న కాళేశ్వరం, మోది కుంట వంటి ప్రాజెక్టులకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన కేంద్రం, ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన (PMKSY) కింద 2026-2031 వరకు తెలంగాణ ప్రాజెక్టులకు ఆర్థిక సహకారం అందిస్తామని హామీ ఇచ్చింది. గోదావరి ట్రిబ్యునల్ నిబంధనల వల్ల వరద జలాల వినియోగం సాధ్యపడటం లేదని మంత్రి ఈ సందర్భంగా సీడబ్ల్యూసీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు.
ఇక కృష్ణా జలాల పంపకాలపై మాట్లాడుతూ, ట్రిబ్యునల్ ద్వారా పంపకాలను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. కృష్ణా జలాలను ఏ రాష్ట్రం ఎంత వినియోగించుకుంటోందో తెలుసుకునేందుకు ఇప్పటికే 18 టెలీ మెట్రీ స్టేషన్లు పూర్తయ్యాయని, తదుపరి దశల్లో మరో 20 (ఫేజ్-2లో 9, ఫేజ్-3లో 11) స్టేషన్లు ఏర్పాటు చేయాల్సి ఉందని వివరించారు. అయితే, ఈ స్టేషన్ల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని మంత్రి ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం ముందుకు రాకపోతే, అవసరమైన పూర్తి నిధులను తెలంగాణ ప్రభుత్వమే భరించి టెలీ మెట్రీ స్టేషన్లను పూర్తి చేస్తుందని కేంద్రమంత్రికి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
Read Also: Indiramma Saree Scheme: కోటి మహిళలకు ఇందిరమ్మ చీరలు.. రెండు దశల్లో పంపిణీకి సీఎం రేవంత్ శ్రీకారం