Vigilance Inquiry: రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీలపై విజిలెన్స్ ఎంక్వయిరీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానంగా విద్యార్ధులకు స్టైఫండ్ ఇవ్వడం లేదనే అంశంపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలోనే అన్ని కాలేజీలకు నోటీసులు ఇచ్చి ప్రభుత్వం వివరణ తీసుకుంది. సుమారు 17 అంశాలపై వివరాలు సేకరించిన సర్కార్.. ఆయా కాలేజీలు ఇచ్చిన వివరణపై సంతృప్తి చెందలేదు. 50 శాతానికి పైగా కాలేజీలు ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు ప్రభుత్వం తన ఇంటర్నల్ ఎంక్వయిరీ ద్వారా గుర్తించింది. దీంతో విజిలెన్స్ ఎంక్వయిరీ చేసి చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ మేరకు కాళోజీ వర్సిటీకి కూడా ఆదేశాలిచ్చినట్లు సమాచారం.
విద్యార్ధులకు స్టైఫండ్ ఇవ్వకపోవడం..
రాష్ట్ర వ్యాప్తంగా 29 ప్రైవేట్ కాలేజీలు ఉండగా, ఇందులో 4 కాలేజీలు మినహా మరే కాలేజీలూ సరైన నిబంధనలు పాటించడం లేదని ప్రభుత్వం గుర్తించింది. స్టైఫండ్ ఇవ్వకపోవడంతో పాటు అకాడమిక్, క్లినికల్ రూల్సేవీ పాటించడం లేదు. ఇటీవల కొందరు పీజీ స్టూడెంట్స్ నేరుగా విజిలెన్స్కు స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్లు సమాచారం. సూరారంలోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీపై ఓ దఫా విజిలెన్స్ వెరిఫికేషన్ జరిగింది. ఆ కాలేజీ విజిట్లో తేలిన తప్పిదాలు చూసి, మిగతా ప్రైవేట్ కాలేజీలన్నింటిపై రెయిడ్స్ తప్పనిసరి అంటూ ప్రభుత్వానికి విజిలెన్స్ టీమ్ వివరించింది. తాజాగా ప్రభుత్వం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో తనిఖీలకు సిద్ధమైనది. గత కొద్ది రోజులుగా కంటిన్యూగా ప్రైవేట్ మెడికల్ కాలేజీలపై ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో సర్కార్ సీరియస్గా ఫోకస్ చేసింది.
విజిలెన్స్ ఎంక్వయిరీ చేసి చర్యలు తీసుకునేందుకు రెడీ
ప్రైవేట్ మెడికల్ కాలేజీకి అఫిలియేషన్ సర్టిఫికేట్ కాళోజీ వర్సిటీ ఇస్తుండగా.. ఈసీ ప్రభుత్వం ఇస్తుంది. ఆయా కాలేజీల తప్పిదాలు, నిర్లక్ష్యం వహిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు సర్టిఫికేట్లను రద్దు చేసే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత నేషనల్ మెడికల్ కమిషన్ కూడా ఆటోమెటిక్గా ఆయా కాలేజీల అనుమతులను రద్దు చేసే ప్రమాదం ఉంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా స్టైఫండ్ ఇవ్వని ప్రైవేట్ కాలేజీలపై ప్రభుత్వం యాక్షన్ తీసుకోనుంది. స్టైఫండ్ను తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనంటూ NMC రూల్స్ స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్కు వచ్చిన NMC చైర్మన్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. కానీ ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలు అత్యుత్సాహంతో విద్యార్ధులకు స్టైఫండ్ అందజేయడం లేదు. కొన్ని కాలేజీలు మొక్కుబడిగా ఐదు వేలు చొప్పున ఇచ్చి చేతులు ఎత్తేస్తున్నాయి. మరి కొన్ని కాలేజీలు విద్యార్ధుల అకౌంట్లలో స్టైఫండ్ వేసి, ఆ తర్వాత వెంటనే డ్రా చేస్తున్నట్లు తెలుస్తోంది. యూజీ, పీజీ రెండు విభాగాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. దీంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: మరో గుండె ఆగింది.. షటిల్ ఆడుతూ కుప్పకూలిన యువకుడు
కనీస నిబంధనలు పాటించకపోవడంపై ప్రభుత్వం సీరియస్
స్టైఫండ్ అడుగుతున్న విద్యార్ధులను ప్రైవేట్ మెడికల్ కాలేజీలు బెదిరింపులకు పాల్పడుతున్నాయి. ఇటీవల ప్రభుత్వం ఎంక్వైయిరీ లోనూ ఇదే విషయం తేలింది. విద్యార్ధుల స్టేట్మెంట్లను కూడా సర్కార్ రికార్డు చేసింది. ఆయా కాలేజీల్లో ప్రజాప్రతినిధుల ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కూడా ఉన్నాయి. పేషెంట్ కేర్, క్లినికల్ ఫెసిలిటీస్, బయోమెట్రిక్ అటెండెన్స్, లేబర్ వెల్ఫేర్, బ్లడ్ బ్యాంక్, ఫ్యాకల్టీ, FMG ఇంటర్న్స్, ఫీజుల వివరాలు, స్టైఫండ్, ఆరోగ్య శ్రీ అమలు వంటివి తప్పనిసరిగా మెయింటెన్ చేయాల్సి ఉంటుంది. అయినప్పటికీ ప్రైవేట్ కాలేజీలు పాటించడం లేదు. ఎన్నిసార్లు చెప్పినా.. పాత పద్ధతులనే అవలంభిస్తున్నాయి. దీంతోనే ప్రభుత్వం సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని ఫిక్స్ అయింది.