Tourism Vigilance: స్వేచ్ఛ బ్యూరో: ప్రభుత్వానికి పేరు తీసుకురావడంతో పాటు ఆదాయాన్ని సమకూర్చే శాఖల్లో ఒకటి టూరిజంశాఖ. అయితే ఈ శాఖలో లీకులను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన విజిలెన్స్ బృందాలకు సభ్యులే లేరు. అయితే శాఖ ఉన్నతాధికారులు దృష్టిసారించకపోవడమా? లేక సరిపడ సిబ్బంది లేకనా? అవినీతి బయటపడుతుందనా? తెలియదుకానీ విజిలెన్స్ టీంలను మాత్రం బలోపేతం చేయడం లేదు. దీంతో శాఖలో ఉన్న 17 విభాగాల్లోనూ అధికారులు, సిబ్బంది ఆడిందే ఆట.. పాడిందే పాటగా తయారైందనే ఆరోపణలు వస్తున్నాయి.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వం టూరిజంపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. టూరిజం ప్రాంతాల బలోపేతంపై దృష్టిసారించింది. అంతేకాదు అడ్మినిస్ట్రేషన్ పైనా నిఘా పెట్టింది. శాఖ ఆదాయానికి కొంతమంది అధికారులు గండికొడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఆడిటింగ్ సైతం పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. అయితే అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పనితీరును పరిశీలించేందుకు గతంలో టూరిజంలో విజిలెన్స్ టీంలు ఏర్పాటు చేశారు. రెండు టీంలు ఉండగా ఒక్కో టీంలో 3ముగ్గురు అధికారులతో ఏర్పాటు చేశారు. టూరిజం ప్లాజాలు, టూరిజం ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టేవారు. అయితే ప్రస్తుతం ఆ బృందాలు లేవు. ఒక్కరే విజిలెన్స్ వ్యవహారాలు చూస్తున్నట్లు సమాచారం. అదికూడా ట్రాన్స్ పోర్టు విభాగం జీఎం చూస్తున్నట్లు సమాచారం. అయితే ఆయన ఒక్కరే ఎలా తనిఖీలు నిర్వహిస్తారు? లీకేజీలను ఎలా అరికడతారనేది ఇప్పుడు ఉద్యోగుల్లోనే చర్చకుదారితీసింది.
Also Read: BRS And BJP Alliance: తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ.. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు ఉందా?
టూరిజం శాఖలో 17 విభాగాలు ఉన్నాయి. ఆయా విభాగాల్లోని కొంతమంది ఉద్యోగులు, సిబ్బందిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆ లీకేజీలను అరికట్టేందుకు, విస్తృత తనిఖీలు చేపట్టేందుకు విజిలెన్స్ విభాగం ఏర్పాటు చేశారు. కానీ ఈ విజిలెన్స్ టీంలో అధికారులను మాత్రం నియమించలేదు. మరి ఎలా తనిఖీలు చేస్తారనేది ఉన్నతాధికారులకే తెలియాలి. మరోవైపు తనికీ చేసేందుకు బృందం ఫలానా ప్లేస్ కు లేక హోటల్ కు, టూరిజం ప్రాంతానికి వెళ్తుందని ముందస్తుగా అక్కడి సిబ్బందికి సమాచారం వెళ్తుందనే ప్రచారం జరుగుతుంది. అలా లీకేజీలు ఇస్తుండటంతో తనిఖీలు పారదర్శకంగా ఎలా జరుగుతందనేది ఇప్పుడు ప్రశ్నలు ఉత్పన్నమవుతోంది. గతంలో విజిలెన్స్ బృందాలు ఎక్కడ తనిఖీకి వెళ్తున్నాయనేది కేవలం శాఖ ఎండీకి మాత్రమే తెలిసేది. కానీ ఇప్పుడు శాఖలోని సిబ్బందే తనిఖీల సమాచారం ఇస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో అక్రమాలకు ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
శాఖలోని అధికారులపై మరో అపవాదు ఉంది. బోటింగ్, హోటల్స్, టూరిజం ప్రాంతాల్లో అనుకున్న చోట పోస్టింగ్ కోసం కొంత మంది పైరవీలు చేసుకుంటున్నారని, పైసలు ఇచ్చి ట్రాన్స్ ఫార్లు చేసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కొంతమంది నచ్చిన చోట పోటీపడి మరి పోస్టింగ్ తెచ్చుకుంటున్నారని, ఒక్కొక్కరు బదిలీపై మరో చోటకు వెళ్లిని తిరిగి అదే చోటకు మళ్లీ పోస్టింగ్ తెచ్చుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. కొంతమంది ఏళ్లుగా పనిచేస్తున్నవారికి సైతం బదిలీలు చేయడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే టూరిజంశాఖకు ఈడీ లేకపోవడం.. పర్యవేక్షణ కొరవడిందనే ప్రచారం జరుగుతుంది. కొంతమంది అధికారుల మధ్య సైతం పరస్పర విభేదాలు ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. అలాంటప్పుడు శాఖ బలోపేతంపై ఎలా దృష్టిసారిస్తారనే ప్రచారం జరుగుతుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టిసారించి విజిలెన్స్ బృందాలను నియమించి అక్రమాలను అరికడతారా? లేదా? అనేది చూడాలి.