Real Estate Fraud: స్వేఛ్చ బ్యూరో: సొంతింటి కల చూపించి జనాన్ని వందల కోట్ల రూపాయలకు ముంచింది వాటర్ కన్ స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ సంస్థ. డబ్బు కట్టి ఏళ్లు గడుస్తున్నా ఫ్లాట్ల నిర్మాణాన్ని పూర్తి చేసి అప్పగించక పోవటంతో బాధితులు సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. కూకట్ పల్లి వై జంక్షన్ ప్రాంతంలో వైట్ వాటర్ కన్ స్ట్రక్షన్ సంస్థ 2018లో భారీ అపార్ట్ మెంట్ ప్రాజెక్టును ప్రారంభించింది. ప్రాజెక్టులో భాగంగా ఏ,బీ,సీ,డీ,ఈ,ఎఫ్ పేర ఆరు టవర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఆలసించిన ఆశాభంగం.. సొంతింటి కలను నిజం చేసుకోండి అంటూ విస్తృతంగా ప్రచారం చేసి దాదాపు అయిదు వందల మంది నుంచి 270 కోట్ల రూపాయల వరకు వసూలు చేసింది.
అయితే, ఇప్పటివరకు కేవలం ఏ, బీ టవర్లలో నిర్మాణాలను కొంత మేర పూర్తి చేశారు. సీ, డీ టవర్లకు సంబంధించి బేస్ మెంట్లు మాత్రమే నిర్మించారు. ఇక, ఈ, ఎఫ్ టవర్ల నిర్మాణం పనులు ప్రారంభమే కాలేదు. జరుగుతున్న ఆలస్యంతో రెరా ఇచ్చిన గడువు ఎప్పుడో ముగిసింది. అయితే, దానిని రెండుసార్లు పొడిగించారు. ఇలా పొడిగించిన గడువు కూడా జూన్ నెలలో ముగియనున్నట్టు సంస్థకు డబ్బు చెల్లించిన బాధితులు చెబుతున్నారు. 2024, డిసెంబర్ నెలలో, 2025లో ఫ్లాట్లు అప్పగిస్తామని చెప్పి లక్షలు..కోట్ల రూపాయలను సంస్థ వసూలు చేసినట్టుగా తెలిపారు. బాధితుల్లో ఒకరైన మూసాపేట వాస్తవ్యురాలు సుజాత అనే మహిళ ఫ్లాట్ కోసం 80 లక్షల రూపాయలు చెల్లించింది. కాగా, ఆమెకు అప్పగిస్తామని చెప్పిన ఫ్లాట్ ను రియల్ ఎస్టేట్ సంస్థ బ్యాంకుల తనఖా పెట్టి 1.27 కోట్ల రూపాయల రుణం తీసుకున్నట్టుగా సమాచారం. దాంతోపాటు ఒకే ఫ్లాట్ ను ఒకరికంటే ఎక్కువ మందికి అమ్మినట్టు రియల్ ఎస్టేట్ సంస్థపై ఆరోపణలు ఉన్నాయి.
Also Read: Bhupalpally district: భూపాలపల్లి జిల్లాలో దారుణం.. ఎనిమిదేళ్ల బాలికపై ఇద్దరు యువకుల అఘాయిత్యం
ఫ్లాట్ కోసం రియల్ ఎస్టేట్ సంస్థ చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోయిన సుజాత సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ అధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో పోలీసులు వాటర్ కన్ స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ సంస్థ యజమాని అజయ్ తోపాటు కొందరు డైరెక్టర్లపై బీఎన్ఎస్ సెక్షన్ 318(4), 316(2), 316(5)తోపాటు డిపాజిటర్ల రక్షణ చట్టం సెక్షన్ 5 ప్రకారం కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని అధికారులు తెలిపారు. ప్రస్తుతం విచారణ సాగుతోందని చెప్పారు. అయిదు వందల మంది నుంచి ఈ సంస్థ 270 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టుగా సమాచారం ఉందన్నారు.
Also Read: Prakash Raj: ప్రకాశ్ రాజ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన వినోద్ కుమార్.. ఆయన ఒక ‘వేస్ట్’ పర్సన్..