Water Wastage: స్వేచ్ఛ బ్యూరో: మేడ్చల్ పట్టణానికి ప్రాణాధారంగా నిలిచిన మేడ్చల్ పెద్ద చెరువు నీరు నిర్లక్ష్యంగా కాల్వలోకి వదులుతుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తూములు తెరిచి భారీగా నీటిని కట్ట కింద వైపు ఉన్న కాల్వలోకి మళ్లించడం వల్ల అమూల్యమైన జలవనరులు వృథా అవుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రణాళికా రహితంగా జరుగుతున్న ఈ నీటి వదులింపు పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. సాగునీటి అవసరాలకు వినియోగించాల్సిన నీటిని నిర్లక్ష్యంగా కాల్వల్లో పారబోసడం వెనుక ఉన్న అసలు కారణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపమే ఈ పరిస్థితికి దారితీసిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చెరువు నీటి మట్టం రోజురోజుకు పడిపోతుండటంతో పరిసర ప్రాంతాల భూగర్భజలాలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కింది బస్తీ, సంతోషిమాత ఆలయం పరిసరాలు, పాత గ్రామ పంచాయతీ, ఎన్జీవోస్ కాలనీ ప్రాంతాల్లోని బోరుబావులు చెరువు నీటిపైనే ఆధారపడి ఉండగా, ఈ పరిస్థితి కొనసాగితే అవి ఎండిపోవచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే తాగునీటి కొరతతో సతమతమవుతున్న పట్టణ ప్రజలు, ఉన్న నీటినే నిర్లక్ష్యంగా వృథా చేయడాన్ని తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. “ప్రతి చుక్క నీరు అమూల్యం” అనే నినాదాలు కేవలం నినాదాలకే పరిమితమైపోయాయా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఇక చెరువు నీటిని ఉద్దేశపూర్వకంగా తగ్గించి చేపల వేటకు అనుకూల పరిస్థితులు సృష్టిస్తున్నారనే ఆరోపణలు మరింత కలకలం రేపుతున్నాయి. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.ఇప్పటికైనా సంబంధిత శాఖలు మేల్కొని తూముల నియంత్రణపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని, చెరువు నీటిని సమర్థవంతంగా వినియోగించేలా ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉందని ప్రజలు స్పష్టం చేస్తున్నారు. లేని పక్షంలో రాబోయే రోజుల్లో మేడ్చల్ పట్టణం మరింత తీవ్రమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితి తలెత్తుతుందని హెచ్చరిస్తున్నారు.
Also Read: ప్రమోషనా పనిష్మెంటా.. సెక్రటేరియట్లో ఆమె బదిలీ వెనక ఆంతర్యమేమిటో..?
ఈ విషయంపై ఇరిగేషన్ వర్క్ ఇన్స్పెక్టర్ ఈషారత్ స్పందిస్తూ, “ఇప్పటివరకు రెండు సార్లు తూములు తెరిచిన ఘటనలను గుర్తించి వెంటనే మూసివేశాం. ప్రస్తుతం మూడోసారి కూడా తూములు తెరవబడినట్లు సమాచారం అందింది. రేపటిలోగా వాటిని పూర్తిగా మూసివేస్తాం. అనుమతి లేకుండా తూములు తెరిచిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని హెచ్చరించారు.
మేడ్చల్ పెద్ద చెరువు నుంచి నీటిని వృథాగా విడుదల చేస్తున్నారని, దీనిని తక్షణమే అడ్డుకోవాలని మాజీ కౌన్సిలర్ స్వామి యాదవ్ డిమాండ్ చేశారు. ఇప్పటికే మేడ్చల్ ప్రాంతంలో తీవ్ర నీటి కొరత నెలకొన్న నేపథ్యంలో చెరువు నీటిని నిర్లక్ష్యంగా వదులడం పరిస్థితిని మరింత విషమం చేస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.భూగర్భ జలాల పరిరక్షణకు చెరువులు కీలకమని, అలాంటి నీటి వనరులను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. చెరువు నీటిని నిరంతరం విడుదల చేస్తూ పోతే బోర్బావుల్లో నీటి మట్టం తగ్గిపోవడంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశముందని హెచ్చరించారు. ప్రతిరోజూ నీటిని వదులుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయమని విమర్శించారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వెంటనే చర్యలు తీసుకుని చెరువు నుంచి నీటి విడుదలను నిలిపివేయాలని మేడ్చల్ మాజీ కౌన్సిలర్ స్వామి యాదవ్ అన్నారు.
Also Read: పంచాయతీరాజ్ శాఖలో భారీగా ఖాళీలు.. ఇదిగో లెక్కలు..!