AEE AE Recruitment: స్వేచ్ఛ బ్యూరో: పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ విభాగంలో ఏళ్లుగా ఖాళీలు భర్తీకి నోచడం లేదు. ఒకటికాదు రెండు కాదు ఏకంగా 576 పోస్టులు వెకెన్సీ ఉండగా, ఈ ఏడాది చివరి నాటికి మరో 42 మంది ఉద్యోగ విరమణ చేయనున్నారు. దీంతో పనిచేస్తున్న ఉద్యోగులపై భారం పడుతుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు ప్రభుత్వానికి ఖాళీల భర్తీపై నివేదించినప్పటికీ స్పందన రాలేదని సమాచారం. పోస్టుల ఖాళీలతో ఫైళ్లు సైతం ముందుకు కదలడం లేదని, సరమైన సమయంలో రోడ్ల పర్యవేక్షణ పనులు సైతం చేయలేకపోతున్నట్లు అధికారులే పేర్కొంటున్నారు. మల్టీ జోన్ల వారీగా ఖాళీల వివరాలను సైతం పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది.
పంచాయతీరాజ్ శాఖలో కీలకమైనది ఇంజనీరింగ్ విభాగం. ఈ విభాగం పటిష్టంగా ఉంటేనే గ్రామాల్లో రోడ్లు, భవనాలు బాగుంటాయి. అందుకు సంబంధించిన పనులు సైతం స్పీడ్ గా జరుగుతాయి. ప్రజలకు సైతం మెరుగైన సేవలు అందుతాయి. వరదల సమయంలోనూ జరిగే నష్టాన్ని అంచనా వేయడం, పనులు సైతం త్వరగా చేయడాని ఈ విభాగమే కీలకం. అయితే ఈ విభాగంలో పనిచేసే ఉద్యోగులు సరిపడ లేకపోవడం, ఏళ్ల తరబడి ఖాళీలను భర్తీ చేయకపోవడంలో ప్రభుత్వం జాప్యం చేస్తుంది. గత ప్రభుత్వ హయాంలోనే ఖాళీలు ఏర్పడినప్పటికీ వాటిపై దృష్టిసారించలేదని సమాచారం. దీంతో పనిచేసే ఉద్యోగులపై భారం పడుతుందని పలువురు పేర్కొంటున్నారు.
ప్రభుత్వానికి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఫిబ్రవరి నెలలో ఖాళీ పోస్టుల వివరాలను అందజేశారు. భర్తీ చేయాలని కోరారు. ప్రభుత్వం విభాగంలో సెక్షన్ ఆఫీసర్స్ (ఏఈఈ, ఏఈ) పోస్టులకు ప్రభుత్వం నుంచి 1375 పోస్టులకు అనుమతి ఇవ్వగా ప్రస్తుతం 799 మంది పనిచేస్తున్నారు. ఫిబ్రవరి నెల చివరి నాటికి 576 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి మరో 42 మంది ఉద్యోగ విరమణ చేయబోతున్నారు. మొత్తం కలిపి 618 పోస్టులు ఖాళీగా ఉండబోతున్నట్లు అధికారులు తెలిపారు. వీటన్నింటిని కలిపి భర్తీ చేయాల్సి ఉందని ప్రభుత్వానికి అధికారులు నివేదించారు.
మొత్తం 618 పోస్టుల్లో 464 పోస్టులు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) కేటగిరీలో భర్తీ చేయనున్నారు. ఇందులో డైరెక్టు రిక్రూట్ మెంట్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. మిగిలిన 154 పోస్టులు అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) కేటగిరీకి కేటాయించారు.ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ 154 పోస్టులలోనూ మళ్లీ 40శాతం పదోన్నతుల తో భర్తీ చేయబోతున్నారు. 92 పోస్టులను ఏఈ లను ప్రత్యక్షంగా నియామకం చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇది ఇలా ఉంటే మొత్తం 464 పోస్టుల్లో మల్టీజోన్-1లో 260, మల్టీజోన్-2లో 204 ఖాళీలు ఉన్నాయి. ఇప్పటికే మల్టిజోన్ -1 కింద 225, మల్టిజోన్ -2 కింద 177 ఏఈఈ పోస్టులు.. మొత్తం 402 పోస్టులను ప్రభుత్వానికి ప్రతిపాదించారు. అదే విధంగా డీఆర్ మల్టిజోనల్ వారిగా అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులను సైతం ప్రభుత్వానికి అందజేశారు. ఇందులో ప్రత్యక్ష నియామమకాల్లో మల్టీజోన్-1 కింద 52 పోస్టులు, మల్టీజోన్-2 కింద 40 పోస్టులు.. మొత్తం 92 పోస్టులు ఉన్నాయని ప్రభుత్వానికి అందజేసిన నివేదికలో పేర్కొన్నారు.
పంచాయతీ రాజ్ లో ఖాళీల భర్తీచేయాలని, ఉన్నవారితో పనిభారం పెరుగుతుందని అధికారులు అధికారులు పేర్కొంటున్నారు. మొత్తం ఖాళీల్లో ఇప్పటికే 402 ఏఈఈ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.త్వరలోనే ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రభుత్వం నుంచి తుది అనుమతులు వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఆ ఖాళీలను భర్తీ చేస్తేనే పంచాయతీరాజ్ లో పనులకు సంబంధించిన పైళ్లు కదులుతాయని, ఉద్యోగులపై పని భారం కూడా తగ్గే అవకాశం ఉంది.
Also Read: ఇందిరమ్మ చీర రంగును మార్చిన సర్కార్.. ఇకపై చీరలన్నీ ఆ కలర్లోనే..?