Minister Uttam: తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ను కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక జల వివాదాలపై చర్చించారు. రెండు ప్రధాన అంశాలపై కేంద్రం తక్షణ జోక్యం కోరారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టాలనుకుంటున్న బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని తెలంగాణ గట్టిగా వ్యతిరేకిస్తుందని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. ఏ రూపంలో నిర్మాణం చేపట్టినా ప్రాజెక్టును ప్రతిఘటిస్తామని తేల్చి చెప్పారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు ఇవ్వకూడదని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్లాన్ చేస్తున్న పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై తమ వ్యతిరేకతను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ ఎత్తును పెంచే ఆలోచనను విరమించుకోవాలని ఉత్తమ్ కోరారు. ఆల్మట్టి ఎత్తు పెంపు తెలంగాణకు తీవ్ర నష్టదాయకమని పేర్కొన్నారు. ఎత్తు పెంపుకు ఎలాంటి అనుమతులు ఇవ్వొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. కర్ణాటకను నిలువరించి ఆల్మట్టి ఎత్తు పెంచకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్తో జరిగిన ఈ భేటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి బనకచర్ల ఆల్మట్టి ఎత్తు పెంపు అంశాలపై తెలంగాణ వాదనను బలంగా వినిపించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ అంశాలపై కేంద్రం త్వరలోనే స్పందిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.