MLC Kavitha : కవిత ఎపిసోడ్ కాక మీదుంది. అన్నతో లొల్లి అంటూ ప్రచారం జరుగుతోంది. పార్టీని వీడిపోతారని అంటున్నారు. జూన్ 2న కొత్త పార్టీ పెడతారని చెబుతున్నారు. కాంగ్రెస్లో చేరుతారంటూ మరో ప్రచారం. ఇలా కవిత చుట్టూ వేడి వేడి వార్తలు వండి వారుస్తున్నారంతా. అయితే, ఆ ప్రచారమంతా ఫేక్ అంటూ.. శాడిజం అంటూ కస్సుమన్నారు కవిత. తనను సంప్రదించకుండా ఇలాంటి న్యూస్ స్ప్రెడ్ చేయడం ఏంటని మండిపడ్డారే కానీ.. ఎక్కడా ఆ వార్తలను ఖండించక పోవడం మరిన్ని అనుమానాలకు కారణం అవుతోంది.
అవన్నీ ఫేక్ అట..
ఇప్పటికే జాగృతి పేరుతో కవిత యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నారు. లేటెస్ట్గా ‘సింగరేణి జాగృతి’ ఏర్పాటు చేసి సమన్వయకర్తలను నియమించారు. బీసీ నినాదం అందుకున్నారు. ఫూలే విగ్రహం కోసం పట్టుబడుతున్నారు. సామాజిక తెలంగాణ నినాదం వినిపిస్తున్నారు. ఇవన్నీ గులాబీ పార్టీ లైన్కు విభిన్నంగా ఉన్నవే. అందులోనూ కవిత చేస్తున్న ఆందోళనల్లో బీఆర్ఎస్ శ్రేణులు పార్టిసిపేట్ చేయట్లేదు. అంతెందుకు ఇటీవల అమెరికా నుంచి వచ్చినప్పుడు సైతం శంషాబాద్ ఎయిర్పోర్టులో జాగృతి సభ్యులు, బీసీ కార్యకర్తలే ఆమెకు స్వాగతం పలికారు కానీ, అక్కడ ఒక్క గులాబీ జెండా కూడా కనిపించలేదు. ఏమనుకోవాలి? కవితతో గులాబీ దళం టచ్ మీ నాట్గా ఉందన్నట్టేగా? కవిత సొంతంగా రాజకీయం చేస్తున్నట్టేగా? కానీ, ఇలాంటి ప్రచారాలన్నిటినీ ఫేక్ అంటున్నారు కవిత.
అంతా కవితనే చేసి..
మై డియర్ డాడీ అంటూ తండ్రికి లేఖ రాశారు. బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు ప్రస్తావన తీసుకొచ్చారు. కేసీఆర్ అందుబాటులో ఉండట్లేదన్నారు. అన్నీ ఆమెనే అన్నారు. ఆ లెటర్ లీక్ అయ్యాక కూడా మరింత హాట్ కామెంట్స్ చేశారు. దెయ్యాలు, కోటరీ అంటూ పెద్ద పెద్ద డైలాగ్సే కొట్టారు. అవన్నీ ఆమె అన్నవే. బయటివాళ్లు చేసిన కామెంట్స్ కాదు. అంతకు ముందు సైతం.. తనపై కుట్ర జరుగుతోందని.. రెచ్చగొడితే మరింత రెచ్చిపోతానంటూ సవాల్ చేశారు. అన్నీ అనేది ఆమెనే. పార్టీలో కుట్రలను బయటపెట్టింది ఆమెనే. ఆ మాటలను బేస్ చేసుకుని.. ఆమె సొంత పార్టీ పెడతారని, కాంగ్రెస్లో చేరుతారనేలా ప్రచారానికి ఆస్కారం ఇచ్చింది కూడా కవితనే అంటున్నారు.
కవిత దారేది?
కవిత కాంగ్రెస్లో చేరే ఛాన్సే లేదనే చెబుతున్నారు. కేసీఆర్ కూతురును హస్తం పార్టీ ఆహ్వానించకపోవచ్చు అంటున్నారు. తనను అరెస్ట్ చేసిన బీజేపీలో ఆమె చేరకపోవచ్చు. ఉంటే బీఆర్ఎస్లోనే ఉండాలి. ప్రాధాన్యం లేకపోతే, అన్నతో పడకపోతే.. బయటకు వచ్చి సొంతపార్టీ అయినా పెట్టుకోవాలి. అంతే. అందుకే, బీజేపీ ఎంపీ రఘునందన్రావు.. కవిత మరో షర్మిల అవుతారంటూ ఆరోపణ చేశారు.
Also Read : జూన్ 2 వరకు వానలే వానలు.. ఆ తర్వాత..!
అది శాడిజమా?
కాంగ్రెస్లో చేరడం, కొత్త పార్టీ పెట్టడాన్ని కవిత సైతం నేరుగా అంగీకరించడం లేదు. ఓ మీడియాలో ఆ మేరకు వార్తలు రాగా.. అవి ఫేక్ అంటూ ట్వీట్ చేశారు కవిత. అయితే, ఆ ట్వీట్లోనూ కాస్త ట్విస్ట్ దాగుందంటున్నారు. తనను అడగకుండా ఆ వార్త రాసిన పత్రికది జర్నలిజమా? శాడిజమా? అని అన్నారే కానీ.. తాను కాంగ్రెస్లో చేరనని, కొత్త పార్టీ పెట్టనని మాత్రం స్పష్టం చేయలేదు. అలా చేసుంటే మరింత క్లారిటీగా ఉండేదని అంటున్నారు.
కనీసం నన్ను సంప్రదించకుండా ఈ వార్త రాసిన పత్రికది జర్నలిజమా?? శాడిజమా ? pic.twitter.com/kUESVnMDTF
— Kavitha Kalvakuntla (@RaoKavitha) May 28, 2025