బీఆర్ఎస్ పార్టీ అధికారం నుంచి దిగిపోయి రెండున్నర ఏండ్లు పూర్తయింది. కానీ, గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులపై మాత్రం చర్చ ఇంకా జరుగుతూనే ఉన్నది. నాడు ప్రాజెక్టులు కేవలం కమీషన్ల కోసమే చేపట్టారని, ప్రజల దాహార్తిని తీర్చడానికి, వ్యవసాయానికి నీళ్లు అందించే ఉద్దేశంతో కాదని అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటికీ వాదిస్తున్నారు. అనవసరంగా ప్రాజెక్టుల రీ డిజైన్ కారణంగా రూ.లక్ష కోట్లు వృథా చేశారని రాష్ట్రంలోని కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీలు సైతం ముందు నుంచి ఆరోపిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు మీద బురద చల్లడానికి బీజేపీ, కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని గులాబీ నేతలు అంటున్నారు.రాష్ట్రంలో సాగు నీరు లేక అల్లాడుతున్న రైతులకు కాళేశ్వరం ద్వారా మరో గొప్ప సాయాన్ని కేసీఆర్ చేశారని చెబుతున్నారు.
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించకుండా రీడిజైన్ పేరుతో కాళేశ్వరం వద్ద ప్రాజెక్టు కట్టి అందులో భాగంగా అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ ప్రాజెక్టుల ద్వారా నీటిని ఎల్లంపల్లి రిజర్వాయర్కు ఎత్తిపోసేలా భారీ ఎత్తున నిర్మాణాలు కేసీఆర్ హయాంలో జరిగాయి. అలా కాళేశ్వరం టు హైదరాబాద్ గోదావరి జలాలు ట్రావెల్ చేస్తాయి. ఎండాకాలంలో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ప్రాజెక్టులే ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయి. ఒకవేళ అవి ఎండిపోతే ఎత్తిపోతల ద్వారా నగరానికి నీరు అందించేలా కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు కొనసాగాయి. అయితే, 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి అనంతరం కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు భూమిలోకి కుంగిపోయాయి.దీనిపై కాంగ్రెస్ సర్కార్ విచారణకు ఆదేశించగా..రూ.లక్ష కోట్లు వృథా కావడానికి మాజీ సీఎం కేసీఆర్ అనాలోచిత నిర్ణయాలే కారణమని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక తేల్చింది. అనంతరం దానిని సర్కారుకు అందజేసింది.
పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ సైతం కాళేశ్వరం ప్రాజెక్టు మీద కీలకవ్యాఖ్యలు చేశారు. లోక్ సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు గాను.. కాళేశ్వరం ప్రాజెక్టు మీద దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు. కేసీఆర్ అనాలోచిత నిర్ణయం వల్లే రూ.లక్ష కోట్లు వృథా అయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు. ప్రాజెక్టు రిపేర్లు రాష్ట్రం పరిధిలోనే ఉంటుందని వెల్లడించారు. ఇప్పటికే పీసీ ఘోష్ కమిషన్.. కాళేశ్వరం వైఫల్యం బీఆర్ఎస్ పార్టీ, మాజీ సీఎం కేసీఆర్దే అని తేల్చగా.. కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ సైతం అదే విషయాన్ని ప్రస్తావించారు. దీంతో బీఆర్ఎస్ నేతలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు.
ఓవైపు కాళేశ్వరం కమిషన్.. మరోవైపు కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ కాళేశ్వరం ప్రాజెక్టు వైఫ్యలం గత ప్రభుత్వానిదే అని కుండబద్దలు కొట్టినా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్ రావు మాత్రం అవన్నీ తప్పుడు ప్రచారాలే అని కొట్టిపారేస్తున్నారు. ఎవరికైనా అనుమానం ఉంటే తమతో వస్తే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు ఎలా పారుతున్నాయో చూపిస్తామని అన్నారు. రైతులకు కాళేశ్వరం జలాలు ఇప్పటికీ అందుతుండటం వల్లే రాష్ట్రంలో వరి పంట పండించే రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందని పేర్కొన్నారు. నిజంగానే కాళేశ్వరం ఎందుకు పనికిరాకపోతే మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు 25 టీఎంసీల నీరు ఎలా వచ్చి చేరిందని అడిగారు. మేడిగడ్డ బ్యారేజీ రెండు పిల్లర్లు కుంగితే మొత్తం ప్రాజెక్టు ఎందుకు పనికిరాదని తప్పుడు ప్రచారం చేయడం సరికాదని మండిపడ్డారు. తమతో వస్తే కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం ఏందో వివరిస్తామని చెప్పారు.