Srikanth Goud: మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో పార్టీ విప్ ఉల్లంఘన ఆరోపణల నేపథ్యంలో మాజీ జెడ్పీటీసీ, న్యాయవాది బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గడిల శ్రీకాంత్ గౌడ్ చేసిన ప్రకటనపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నెలకొంది. కాంగ్రెస్ పార్టీకి ఆంటీ-డిఫెక్షన్ విషయంపై మాట్లాడే నైతిక హక్కు లేదని ఆయన చేసిన వ్యాఖ్యలకు ప్రతిపక్షం ఘాటైన కౌంటర్ ఇచ్చింది.
పార్టీ గుర్తుపై గెలిచిన ప్రజా ప్రతినిధి, అదే పార్టీ అధికారిక నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేస్తే అది ప్రజా మాండేటుకు విరుద్ధం కాదా?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. అసెంబ్లీ స్థాయి ఉదాహరణలు చూపిస్తూ స్థానిక సంస్థల చట్టపరమైన ప్రక్రియను తప్పుబట్టడం సరైందా? రెండు వేర్వేరు చట్ట వ్యవస్థలను కలిపి ప్రజలను గందరగోళానికి గురిచేయడమే కాదా? అని ప్రశ్నించింది.
Also Read: Actress Meena : కర్మ ఎవర్నీ వదిలిపెట్టదు.. ఫైర్ అవుతున్న మీనా.. అసలేమైందంటే?
వాట్సాప్ ద్వారా విప్ పంపడం చట్టబద్ధ సేవ కాదు అన్న వాదనపై కూడా ప్రతిస్పందన వచ్చింది. విప్ అందలేదని చెబుతున్న వారు దానికి వ్యతిరేకంగా స్పష్టమైన ఆధారాలు చూపగలరా? ఒకవేళ విప్ చట్టబద్ధంగా జారీ అయి, సరైన విధంగా అందినట్లు నిరూపితమైతే డిస్క్వాలిఫికేషన్ను అంగీకరిస్తారా?” అని సూటిగా నిలదీశారు.
ఆంటీ-డిఫెక్షన్ నిబంధనలు శిక్షాత్మకమని చెబుతూ, పార్టీ క్రమశిక్షణను విస్మరించడం ఎలా సమర్థనీయమవుతుందో చెప్పాలన్నారు. “ప్రజలు ఓటు వేసింది వ్యక్తికా? లేక పార్టీ విధానానికా? పార్టీ నిర్ణయాన్ని తుంగలో తొక్కితే అది ఓటర్ల విశ్వాసానికి భంగం కాదా?” అని ప్రశ్నించారు.
ఇదిలా ఉంటే, గతంలో పార్టీ మార్పులపై అదే స్థాయిలో స్పందించారా? నైతికతపై ఉపన్యాసాలు ఇస్తున్న వారు తమ వైఖరిలో స్థిరత్వం చూపించారా? అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. చట్ట పరిపాలన, న్యాయ ప్రక్రియ, ఆధారాల ప్రమాణాలు అన్నీ అవసరమేనని అంగీకరిస్తూనే, రాజకీయ వాదనలు ముందుకు తెచ్చి ప్రజాస్వామ్య ప్రక్రియను ప్రభావితం చేయడం సరికాదని ప్రతిపక్ష వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మొత్తానికి, విప్ ఉల్లంఘన అంశం ఇప్పుడు కేవలం చట్టపరమైన వివాదం మాత్రమే కాకుండా రాజకీయ నైతికతపై కూడా పెద్ద చర్చకు దారి తీసింది. ప్రజాస్వామ్యంలో విధానం రక్షణ కవచమైతే, పార్టీ క్రమశిక్షణ కూడా ప్రజా మాండేటు పరిరక్షణకే అని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
Also Read: Illegal Constructions: రాజబొల్లారంలో అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు.. పట్టించుకోని అధికారులు