బీఆర్ఎస్ పార్టీకి మరో వాయిస్ దొరికింది. మొన్నటివరకు మౌనంగా ఉండిపోయిన మాజీ మంత్రి,సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మళ్లీ ఫామ్లోకి వచ్చారు. పార్టీ ఓడిపోయినప్పటి నుంచి ఆయన మౌనంగానే ఉన్నారు.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావుల వెంటే ఉండే ఆయన.. గులాబీ బాస్ బయటకు వచ్చినప్పుడు సైతం ఆయన వెంట కనిపించారు.కానీ, మీడియాతో మాట్లాడేందుకు మొన్నటివరకు ఆయన సాహసం చేయలేదు. అందుకు చాలా కారణాలే ఉన్నాయని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఎందుకంటే ఆయన మంత్రిగా ఉన్న టైంలో ఆయన శాఖలో భారీగా అవినీతి జరిగినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది.
అసెంబ్లీ సెషన్స్ సందర్భంగా బీజేపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొందరు ప్రభుత్వంపై ధిక్కార స్వరం వినిపించారు.కానీ, మాజీ మంత్రి మాత్రం సీఎం రేవంత్ మీద, కాంగ్రెస్ ప్రభుత్వం, ఇతర మంత్రుల మీద ఎటుంటి కామెంట్స్ చేయలేదు. మీడియా పాయింట్లో అప్పుడప్పుడు మాట్లాడిన పెద్దగా వైరల్ కామెంట్స్ ఎప్పుడు చేయలేదు. ఇటీవల అసెంబ్లీ సెషన్స్లో సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ వద్దకు రాగానే తలసాని సైతం నిలబడి ఆయనకు నమస్కారం చెప్పారు. ఆ తర్వాత కేసీఆర్ మీద రేవంత్ పెద్దఎత్తున విమర్శలు చేసిన సందర్భంలోనూ ఆయన ఏమీ మాట్లాడలేదు. అయితే, సడన్గా మాజీ మంత్రి తలసాని ఏకంగా సీఎం రేవంత్ మీద పరుష పదజాలంతో రెండ్రోజుల కింద తీవ్ర విమర్శలు చేశారు.
తలసాని శ్రీనివాస్ యాదవ్ మహానగరంలో కీలకనేత. సనత్ నగర్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయనకు పెద్దఎత్తున యాదవ సామాజికవర్గం సపోర్టు ఉన్నది. సదర్ ఉత్సవాల్లో ఆయన కీలక భూమిక పోషిస్తారు. గత పదేండ్లు బీఆర్ఎస్ హయాంలో పశుసంవర్ధకశాఖ మంత్రిగా పనిచేశారు. తన స్ట్రాంగ్ బ్యాగ్రౌండ్ ఉన్నా.. కాంగ్రెస్ సర్కారు మీద విమర్శలు చేయడానికి ఆయన ఇంతకాలం ధైర్యం చేయలేదు. కానీ, రెండ్రోజుల కిందట గ్రేటర్ హైదరాబాద్ను మూడు కార్పొరేషన్లుగా చేయాలని ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ను విభజించాలని సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. అంతటితో ఆగకుండా సికింద్రాబాద్ను ముక్కలు చేయాలని చూస్తే నిన్ను ముక్కలు చేస్తాం అని సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించారు.
Congress : మున్సి’పోల్స్’.. రెబల్స్, మిత్రపక్షంపై ఏం చేద్దాం?
అంతటితో ఆగకుండా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇంతకాలానికి తలసాని ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్స్ చేయడంతో నగరంలోని గులాబీ కేడర్ జోష్లోకి వచ్చింది. మరి ఆయన వెనుక ఉండి ఈ వ్యాఖ్యలు ఎవరు చేయించారు? కేసీఆర్? కేటీఆర్? వీరిద్దరిలో ఎవరు అయి ఉంటారని అధికార పార్టీలోనూ చర్చ జరుగుతున్నది. కేసీఆర్ హయాంలో జరిగిన గొర్రెల స్కామ్ వెనుక తలసాని ఉన్నారని అప్పట్లో జోరుగా వార్తలు వచ్చాయి. సుమారు రూ.500 నుంచి 700 కోట్ల కుంభకోణం జరిగిందని, ఏపీలోని రైతుల నుంచి యూనిట్ల చొప్పున గొర్రెల కొని.. వారికి బిల్లులు చెల్లించకుండా మాయం చేశారని ఆరోపణలున్నాయి. దీని వెనుక అప్పటి మంత్రి తలసాని పీఏ హస్తముందని సైతం ఆరోపణలున్నాయి.ఇంతకాలం అరెస్టు భయంతోనే ఆయన నోరుతెరవ లేదని టాక్. కానీ ఇప్పుడు ఆయన నోరుతెరవడంతో ఎవరో వెనుక ఉండి మాట్లాడిస్తున్నారని.. వారెవరని సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతున్నది.లేదా తన సికింద్రాబాద్లో తన ఉనికి కోసమే ఇలా మాట్లాడారా? అన్న ప్రచారం సైతం జరుగుతోంది.