Boggula Srinivas Murder: ఖమ్మం జిల్లాలో రచయిత బొగ్గుల శ్రీనివాస్ మృతి కేసులో పోలీసులు సంచలన విషయాలను వెల్లడించారు. శ్రీనివాస్ మరణం సాధారణ కారు ప్రమాదం కాదని.. అది పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన సుపారీ హత్య అని ఖమ్మం పోలీసులు నిర్ధారించారు. ఆర్థిక లావాదేవీల కారణంగా శ్రీనివాస్ అత్యంత సన్నిహితుడు.. స్నేహితుడైన వేణుమాధవ రెడ్డి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు దర్యాప్తులో తేలింది. నిందితుడు వేణుమాధవ రెడ్డితో పాటు ఈ హత్యలో పాలుపంచుకున్న మరో ముగ్గురిని కూసుమంచి పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితుల నేర ప్రవృత్తిని వివరిస్తూ పోలీసులు విస్తుపోయే నిజాలను వెల్లడించారు. నార్కట్ పల్లి – నకిరేకల్ మధ్య శ్రీనివాస్ను హత్య చేసిన నిందితులు.. ఆ తర్వాత మృతదేహాన్ని పాలేరు రిజర్వాయర్ సమీపంలోకి తీసుకువచ్చారు. హత్యను కారు ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని రిజర్వాయర్లో పడేశారు. పోలీసుల విచారణలో నిందితులు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు నిజం బయటపడింది. ప్రధాన నిందితుడు వేణుమాధవ రెడ్డి ఆర్థిక కారణాలతోనే శ్రీనివాస్ను అడ్డు తొలగించుకోవాలని సుపారీ ఇచ్చి చంపించినట్లు ఒప్పుకున్నాడు.
ఈ హత్యకు రాజకీయ రంగు పులిమే ప్రయత్నాలపై ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి స్పష్టతనిచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై బొగ్గుల శ్రీనివాస్ గతంలో ఒక పుస్తకం రాశారు. అయితే ఈ పుస్తకానికి.. ప్రస్తుతం జరిగిన హత్యకు ఎటువంటి సంబంధం లేదని ఆయన ఖరాకండిగా చెప్పారు. కేవలం డబ్బులకు సంబంధించిన వివాదాలే ఈ హత్యకు మూలకారణమని ప్రాథమిక దర్యాప్తులో స్పష్టమైంది. అనవసరమైన ఆరోపణలు చేయవద్దని.. వాస్తవాలను గమనించాలని ఆయన కోరారు.
పోలీసులు ఈ కేసులో శాస్త్రీయ ఆధారాలను సేకరించారు. నిందితుల కాల్ డేటా.. కారు ప్రయాణించిన మార్గంలోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించి పక్కా ఆధారాలతో నిందితులను పట్టుకున్నారు. నిందితులపై హత్య కేసుతో పాటు సాక్ష్యాలను తారుమారు చేసినందుకు సంబంధించిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. శ్రీనివాస్ మృతితో ఆయన కుటుంబ సభ్యులు.. సాహితీ మిత్రులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. స్నేహితుడే వెన్నుపోటు పొడిచి ప్రాణాలు తీయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
Read Also: Gurugram horror: డేటింగ్ యాప్తో పరిచయం.. ఆపై సహజీవనం, చివరకు ఏమైందంటే..