Red Road in India: ప్రతి ఏటా రోడ్డు ప్రమాదాల్లో వేలాది మంది మనుషులతో పాటు పెద్ద సంఖ్యలో వన్యప్రాణులు కూడా మృత్యువాత పడుతున్నాయి. ముఖ్యంగా దట్టమైన అడవుల మధ్య నుంచి వెళ్లే జాతీయ రహదారులపై వెహికల్స్ రాకపెరగడంతో చాలా జంతువులకు ప్రమాదం జరుగుతోంది. ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్డు ప్రమాదాల్లో వన్యప్రాణాలకు హాని కలగకుండా ఓ అద్భుతమైన ప్లాన్ అమల్లోకి తీసుకొచ్చింది. మధ్యప్రదేశ్లోని వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వ్ పరిధిలో కొత్త విధానాన్ని అమలు చేసింది. వన్యప్రాణుల రక్షణ కోసం భోపాల్–జబల్పూర్ జాతీయ రహదారి NH-45లోని కొంత భాగాన్ని ప్రత్యేకంగా తయారు చేసింది.
టైగర్ రిజర్వ్ గుండా వెళ్లే NH-45లో సుమారు 2 కిలోమీటర్ల పరిధిలో ప్రత్యేకమైన ఎర్రటి థర్మోప్లాస్టిక్ స్ట్రిప్స్ ఏర్పాటు చేశారు. దాదాపు 5 మిల్లీమీటర్ల మందంతో ఉన్న ఈ ఉపరితలం సాధారణ రహదారులతో పోలిస్తే ప్రత్యేకంగా కనిపిస్తుంది. రోడ్డుపై ఎరుపు రంగు వేయడం వెనుక ఉద్దేశం అందం లేదంటే గుర్తింపు కోసం కాదు. వాహనదారులు ఆ ప్రాంతానికి చేరుకున్నప్పుడు అప్రమత్తంగా ఉండేలా చేయడం, వేగాన్ని తగ్గించేలా చూడటం.
ఈ రెడ్ రోడ్పై వెహికల్స్ ప్రయాణించే సమయంలో కాస్త షేకింగ్ ఏర్పడుతుంది. దీంతో డ్రైవర్కు రహదారి సాధారణంగా లేదనే విషయం వెంటనే అర్థమవుతుంది. వాహనం వేగాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. అడవుల్లో అకస్మాత్తుగా జంతువులు రోడ్డుపైకి వచ్చే సందర్భాల్లో అధిక వేగంతో వెళ్లే వాహనాలను నియంత్రించడం చాలా కష్టం. వేగం తగ్గితే డ్రైవర్ కు రియాక్ట్ అయ్యేందుకు కాస్త సమయం లభిస్తుంది. అదే వన్యప్రాణుల ప్రాణాలను కాపాడటంలో కీలకంగా మారుతుంది.
టైగర్ రిజర్వ్ పరిధిలో పులులు, చిరుతలు, జింకలు లాంటి బోలెడు వన్యప్రాణులు తిరుగుతుంటాయి. అడవిలో ఒక వైపు నుంచి మరో వైపుకు వెళ్లే సమయంలో ఇవి రెడ్డును దాటే అవకాశం ఉంది. అలాంటి సమయంలో వాహనాలు వేగంగా దూసుకెళ్తే ఢీకొనే ప్రమాదం ఉంటుంది. కొత్త రహదారి ఏర్పాటుతో వాహనాల వేగాన్ని తగ్గించడం ద్వారా ఇలాంటి ప్రమాదాలను నియంత్రించాలనే లక్ష్యంతో అధికారులు చర్యలు చేపట్టారు.
రెడ్ రోడ్ ఒక్కటే ఈ ప్రాజెక్టులో ప్రత్యేకత కాదు. వన్యప్రాణులు నేరుగా రహదారిపైకి రాకుండా సుమారు 8 అడుగుల ఎత్తైన ఇనుప కంచెను ఏర్పాటు చేశారు. దీంతో జంతువులు రోడ్డు దాటే ప్రాంతాలను కొంతవరకు కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. అదే సమయంలో వన్యప్రాణులు సురక్షితంగా రహదారిని దాటేందుకు 25 స్పెషల్ అండర్పాస్లను కూడా ఏర్పాటు చేశారు. దీంతో జంతువులకు రోడ్డు మీదుగా వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది. మధ్యప్రదేశ్లో ఏర్పాటు చేసిన ఈ ‘రెడ్ రోడ్’ ప్రయోగం సక్సెస్ అయితే, వన్యప్రాణుల సంచారం ఎక్కువగా ఉండే ఇతర జాతీయ రహదారులపైనా ఇలాంటి పద్ధతులను పరిశీలించే అవకాశం ఉంది.
Read Also: తెలుగు రాష్ట్రాల మధ్య మరో గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వే.. రూ.25,000 కోట్ల మెగా ప్లాన్!