New 298 Km Greenfield Expressway: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య రవాణా రంగానికి సంబంధించి మరో భారీ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.25,000 కోట్ల అంచనా వ్యయంతో కొత్త గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వేను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ మార్గం తెలంగాణలోని ముచర్ల ఫ్యూచర్ సిటీని ఆంధ్రప్రదేశ్లోని అమరావతి మీదుగా మచిలీపట్నం పోర్టుతో లింక చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఏకంగా 298 కిలోమీటర్ల పొడవుతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం డీపీఆర్ దశలో ఉంది.
ప్రతిపాదిత ఎక్స్ ప్రెస్ వే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదుగా సాగనుంది. ఇందులో తెలంగాణ పరిధిలో సుమారు 118 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్లో సుమారు 180 కిలోమీటర్ల మేర రహదారి నిర్మించనున్నారు. ఈ మార్గం పూర్తయితే రెండు రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యం అద్భుతంగా ఉండబోతోంది. అన్ని ప్రణాళికలు పూర్తయిన తర్వాత 2026 చివరి నాటికి లేదంటే 2027లో నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ఈ కొత్త గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వేను తొలుత 6 లేన్లుగా నిర్మించాలని ప్రతిపాదించారు. భవిష్యత్తులో వాహనాల రద్దీ పెరిగితే దీనిని 12 లేన్ల వరకు విస్తరించే అవకాశం కూడా ఉంటుంది. అత్యాధునిక ప్రమాణాలతో ఈ హైవేను నిర్మించేలా ప్లాన్ చేస్తున్నారు. కొత్తగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు, పారిశ్రామిక కేంద్రాలు, పోర్టులను అనుసంధానించేలా ఈ మార్గాన్ని రూపొందించే అవకాశం ఉంది. సాధారణ ప్రయాణికులతో పాటు సరుకు రవాణా రంగానికి కూడా ఈ ప్రాజెక్ట్ కీలకంగా మారనుంది.
ఈ ప్రాజెక్టులో మరో ప్రత్యేకత కూడా ఉంది. ఎక్స్ ప్రెస్ వేతో పాటు సమాంతరంగా లేదంటే ప్రత్యేక కారిడార్ లో సెమీ హైస్పీడ్ రైల్వే లైన్ నిర్మించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు. ఈ రైల్వే లైన్ లో రైళ్లు గంటకు సుమారు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. రహదారితో పాటు వేగవంతమైన రైలు సదుపాయం కూడా అందుబాటులోకి వస్తే హైదరాబాద్, అమరావతి, మచిలీపట్నం ప్రాంతాల మధ్య కనెక్టివిటీ మరింత పెరుగుతుంది.
ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత హైదరాబాద్ నుంచి అమరావతి మధ్య ప్రయాణ సమయం భారీగా తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రతిపాదిత మార్గం ప్రకారం ప్రయాణాన్ని సుమారు 2.5 గంటల్లో పూర్తి చేసే అవకాశం ఉంటుంది. వేగవంతమైన రహదారి, భవిష్యత్ రైల్వే కనెక్టివిటీ అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు మరింత ప్రయోజనం కలగనుంది.
ఈ ప్రాజెక్టులో మచిలీపట్నం పోర్టు అనుసంధానం కీలక అంశంగా ఉంది. తెలంగాణలో తయారయ్యే పారిశ్రామిక ఉత్పత్తులను రోడ్డు మార్గం ద్వారా త్వరగా పోర్టుకు తరలించే అవకాశం ఉంటుంది. అక్కడి నుంచి సముద్ర మార్గం ద్వారా ఇతర దేశాలకు ఎగుమతి చేయడం సులభమవుతుంది. ముఖ్యంగా తెలంగాణ పారిశ్రామిక ప్రాంతాలకు వేగవంతమైన ఎగుమతి మార్గంగా ఉపయోగపడే అవకాశం ఉంది. రవాణా సమయం తగ్గడంతో పాటు లాజిస్టిక్స్ ఖర్చులు కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి.
Read Also: ప్రకృతి అందాల నడుమ వందేభారత్ ప్రయాణం.. ఈ 6 రూట్స్ అస్సలు మిస్ అవ్వకండి!