Air India Pilot: ఎయిరిండియా విమానం కుదుపుల వ్యవహారం కొత్త మలుపు తిరిగిందా? పైలట్ మద్యం తాగి విమానం నడిపాడా? పైలట్ డోప్ పరీక్షలో విఫలమయ్యాడా? ఈ విషయం తెలియగానే ఎయిర్ ట్రావెలర్లతో టెన్షన్ మొదలైందా? ప్రస్తుతానికి విచారణ పూర్తి అయ్యేవరకు సిబ్బందిని విధులకు దూరంగా ఉంచారా? అవుననే అంటున్నాయి విమానయాన వర్గాలు.
ఐదురోజుల కిందట థాయ్లాండ్లోని ఫుకెట్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిరిండియా విమానం ఆకాశంలో తీవ్ర కుదుపులకు లోనయ్యింది. తీవ్రమైన గాలి ధూళి అలా జరిగిందని అందరూ భావించారు. విమానం ఢిల్లీ చేరుకున్న తర్వాత పైలట్కు పరీక్షలు నిర్వహించారు. పైలట్ ఇన్ కమాండ్ మత్తు పదార్థాలు తీసుకున్నట్లు తేలింది. అతడికి చేసిన రెండు పరీక్షల్లో ఒకదానికి పాజిటివ్ వచ్చినట్టు విమానయాన వర్గాలు చెబుతున్నాయి.
ఇది ఫైనల్ కాదని తేల్చేశాయి. మరో రౌండ్ పరీక్ష ఫలితాలు రావాల్సి ఉందన్నాయి. విచారణ పూర్తయ్యే వరకు ఆ విమానం నడిపిన ఇద్దరు పైలట్లను విధులకు దూరం పెట్టినట్లు ఆ సంస్థ స్పష్టం చేసింది. పైలట్ డోపింగ్ పరీక్ష ఫలితాలను ఇంకా ఎయిర్ ఇండియా ధృవీకరించలేదు. నిబంధనల ప్రకారం పైలట్లకు పరీక్షలు నిర్వహించామని, నివేదిక ఇంకా ఎయిరిండియాతో పంచుకోలేదని ఆ విమానయాన సంస్థ పేర్కొంది.
అందువల్ల ఆ ఫలితాలపై వ్యాఖ్యానించలేమని తెలిపింది. నిబంధనల ప్రకారం తమ సిబ్బందికి క్రమం తప్పకుండా డ్రగ్ టెస్టులు నిర్వహిస్తామని పేర్కొంది. అవసరమైతే సంబంధిత అధికారులకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపింది. తీవ్రమైన సంఘటన తర్వాత విమానాన్ని ఢిల్లీకి మళ్లించడం సరైన నిర్ణయమా? వారణాసి లేదా లక్నో సమీప విమానాశ్రయంలో దాన్ని దించాల్సి ఉండేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
విచారణ పూర్తయ్యే వరకు విమాన సిబ్బంది మొత్తాన్ని విమానయాన విధుల నుండి తొలగించారు. పైలట్లు ప్రస్తుతం ఏ విమానాలు నడపడం లేదు. 137 మంది ప్రయాణికులు 8 మంది సిబ్బందితో ఆగస్టు 4న ఎయిరిండియా విమానం AI2379 ఆకాశంలో ఒక్కసారిగా ఎత్తు నుంచి కిందకు అకస్మాత్తుగా దొగొచ్చింది. దాదాపు ఐదు నిమిషాల పాటు ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
ALSO READ: చివరి నిమిషంలో టికెట్ కావాలా? సింపుల్ గా ఇలా ట్రై చేస్తే కన్ఫార్మ్ సీటు పక్కా!
ఈ ఘటనలో 13 మంది ప్రయాణికులతోపాటు నలుగురు సిబ్బంది గాయపడ్డారు. ఇద్దరికి వెన్నెముక గాయాలైనట్టు సమాచారం. తొలిసారిగా డ్రగ్ వాడినట్లు తేలితే పునరావాస కేంద్రానికి తరలిస్తారు. రెండోసారి దొరికితే మూడేళ్ల పాటు లైసెన్స్ రద్దు చేస్తారని విమానయాన నిబంధనలు చెబుతున్నాయి. ఈ ఘటనపై పౌర విమానయాన విభాగం విచారణ చేపట్టింది.