Air India’s New Boeing 787-9: టాటా యాజమాన్యంలో ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ సరికొత్త బోయింగ్ విమానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయాణీకులకు మరింత అత్యాధునిక సౌకర్యాలను కల్పించడమే లక్ష్యంగా ప్రత్యేకంగా రూపొందించిన ఇంటీరియర్స్ తో తొలి లైన్ ఫిట్ బోయింగ్ 787-9 డ్రీమ్ లైనర్ ను లాంచ్ చేసింది. VT-AWAగా రిజిస్టర్ అయిన ఈ విమానం, బోయింగ్ ప్రొడక్షన్ లైన్ నుంచి నేరుగా డెలివరీ చేయబడిన తొలి వైడ్ బాడీ విమానంగా గుర్తింపు తెచ్చుకుంది. అమెరికాలోని బోయింగ్ ఎవెరెట్ ఫెసిలిటీ నుంచి బయల్దేరిన ఈ నాన్ స్టాప్ విమానం ఇప్పటికే ఢిల్లీకి చేరుకుంది. ఫిబ్రవరి 1 నుంచి ముంబై-ఫ్రాంక్ ఫర్ట్ రూట్ లో కమర్షియల్ సేవలను ప్రారంభించనుంది.
మూడు సంవత్సరాల కిందట 470 విమానాలను ఎయిర్ ఇండియా ఆర్డర్ చేసింది. ఈ విమానం మొదటి వైడ్ బాడీ విమానంగా అందుబాటులోకి వచ్చినట్లు ఎయిర్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ కాంప్బెల్ విల్సన్ వెల్లడించారు. ప్రైవేటీకరణ తర్వాత దాదాపు 100 కొత్త, లీజుకు తీసుకున్న విమానాలు ఇప్పటికే ఎయిర్ ఇండియా గ్రూప్ ఫ్లీట్ లో చేరాయన్నారు.
కొత్త ఇంటీరియర్స్ తో త్వరలో బోయింగ్ 787 ఫ్లీట్లో చేరనున్నట్లు ఎయిర్ ఇండియా వెల్లడించింది. మరో 19 ఉత్పత్తి దశలో ఉన్న విమానాలతో పాటు, ఎయిర్ ఇండియా ప్రస్తుత బోయింగ్ 787-8 విమానాలలోని 26 విమానాలను అదే కొత్త క్యాబిన్ ఇంటీరియర్స్, ఎంటర్ టైన్ మెంట్ వ్యవస్థలతో రీట్రోఫిట్ చేస్తున్నారు. తొలుత అప్ గ్రేడ్ చేసిన విమానం త్వరలో సర్వీసులను ప్రారంభిస్తుంది. మిగిలినవి 2027 మిడిల్ ఇయర్ నాటికి అందుబాటులోకి రానున్నాయి.
కొత్త బోయింగ్ 787-9 మూడు క్లాసుల క్యాబిన్ లే అవుట్ను కలిగి ఉంది. ఇందులో బిజినెస్, ప్రీమియం ఎకానమీ, ఎకానమీ క్లాస్లలో మొత్తం 296 సీట్లు ఉంటాయి. అన్ని సీట్లు థేల్స్ AVANT అప్ ఇన్ ఫ్లైట్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్, 4K QLED టచ్స్క్రీన్లతో ఉంటాయి. బిజినెస్ క్లాస్ క్యాబిన్లో 1-2-1 కాన్ఫిగరేషన్లో అమర్చబడిన 30 సూట్లు ఉన్నాయి. సూట్లు పూర్తిగా ఫ్లాట్ బెడ్లుగా మారుతాయి. బ్లూటూత్ ఆడియో కనెక్షన్, వైర్ లెస్ ఛార్జింగ్, ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్ లు, మెరుగైన స్టోరేజ్ లాంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. స్లైడింగ్ ప్రైవసీ డోర్ కూడా ఉంటుంది.
ఇక ప్రీమియం ఎకానమీ 2-3-2 కాన్ఫిగరేషన్లో 28 సీట్లను కలిగి ఉంది. పెద్ద లెగ్ రూమ్, అడ్జెస్ట్ చేసే హెడ్ రెస్ట్ లు, మరింత సౌకర్యంగా ఉంటాయి. పెద్ద ఎంటర్ టైన్ మెంట్ స్క్రీన్లను అందిస్తుంది. ఎకానమీ క్లాస్ 3-3-3 లే అవుట్లో 238 సీట్లను కలిగి ఉంది. అప్గ్రేడ్ చేసిన స్క్రీన్లు, ఛార్జింగ్ పోర్ట్ లతో ఉంటుంది. ఈ ఇంటీరియర్స్ ను గ్లోబల్ డిజైన్ స్టూడియో JPA డిజైన్తో కలిసి అభివృద్ధి చేశారు.
ఎయిర్ ఇండియా ప్రస్తుతం 300 కంటే ఎక్కువ విమానాలను నడుపుతోంది. ప్రపంచ వ్యాప్తంగా 106 గమ్యస్థానాలకు సర్వీసులు కొనసాగిస్తుంది. దాదాపు ఏడు దశాబ్దాల ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న ఈ విమానయాన సంస్థ 2022లో టాటా గ్రూప్కు తిరిగి వచ్చింది.
Read Also: ఆ రైళ్లలోకి పిల్లల నో ఎంట్రీ, దుమారం రేపుతున్న ఫ్రెంచ్ రైల్వే నిర్ణయం!