ప్రపంచంలో ఏ రైల్వే తీసుకొని ఓ వివాదాస్పద నిర్ణయాన్ని ఫ్రెంచ్ రైల్వే తీసుకుంది. హైస్పీడ్ రైళ్లలోకి పిల్లలను అనుమతించకూడదని తాజాగా నిర్ణయించింది. ఈ రైళ్లలో చాలా మంది ఉద్యోగం కోసం, విశ్రాంతి కోసం ప్రయాణిస్తున్నారని, వాటిలోకి పిల్లలను అనుమతించడం వల్ల ఇతరులకు ఇబ్బందులు కలుగుతున్నాయని భావించింది. ఈ నేపథ్యంలోనే సదరు రైళ్లలోకి పిల్లలను అనుమతించకూడని భావిస్తోంది. ఈ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పిల్లలు ఉన్న తల్లిదండ్రులను హైస్పీడ్ రైల్వే సేవల నుంచి దూరం చేసేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఫ్రాన్స్ హై స్పీడ్ రైల్వే సర్వీసు అయిన TGV INOUIలోకి పిల్లలను అనుమతించని కొత్త ప్రీమియం క్లాస్ క్యారేజీని ప్రారంభించింది. ఆప్టిమమ్ అని పిలిచే ఈ క్యారేజీ జనవరి 8 నుంచి పారిస్ కు, బయటకు వచ్చేఅనేక TGV మార్గాలలో అందుబాటులో ఉంటుంది. ఆప్టిమమ్ క్లాస్ అనేది ప్రైవసీ, నిశ్శబ్ద ప్రయాణ అనుభవాన్ని కోరుకునే ప్రయాణీకుల కోసం రూపొందించబడిందని ఫ్రెంచ్ రైల్ ఆపరేటర్ SNCF వెల్లడించింది. సౌకర్యవంతమైన టికెట్లు, మంచి కస్టమర్ సర్వీస్ తో తక్కువ మంది ప్రయాణీకులు వెళ్లేలా ఫస్ట్ క్లాస్ క్యారేజీని అందిస్తుంది. ఇందులోకి పిల్లలను అనుమతించకూడదని నిర్ణయించింది.
ఫ్రెంచ్ రైల్వే తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పిల్లలను నిషేధించడం అంటే వివక్ష చూపించడమేనని మండిపడుతున్నారు. ప్రజా రవాణా వ్యవస్థల్లో ఇలాంటి నిషేధాలు తగవంటున్నారు. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
అటు రైల్వే తీసుకొచ్చిన ఆప్టిమమ్ క్లాస్ లోని ధరల పైనా విమర్శలు వస్తున్నాయి. సామాన్యులకు అందుబాటులో లేని విధంగా ఈ ధరలు ఉన్నాయంటున్నారు. పారిస్-లియోన్ ప్రయాణానికి రెగ్యులర్ ఫస్ట్ క్లాస్లో దాదాపు 132 యూరోలు (రూ. 14358) ఖర్చవుతుంది. అయితే చైల్డ్ ఫ్రీ ఆప్టిమమ్ ప్లస్ టికెట్ ధర 180 యూరోలు (రూ. 19579) వరకు ఖర్చవుతుంది. అయితే, ఈ క్లాస్ లో ప్రయాణించే వారికి పర్సనల్ హోస్ట్, ఫుడ్ సర్వీస్ కూడా ఉంటుందిని టికెట్లు విక్రయించే SNCF కనెక్ట్ వెబ్ సైట్ తెలిపింది.
SNCF తాజా నిర్ణయంపై ఫ్రాన్స్ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఫ్రాన్స్ పిల్లల హైకమిషనర్ సారా ఎల్ హెయిరీ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. పిల్లలతో ప్రయాణించడం అనేది జీవితంలో ఒక సాధారణ భాగమన్నారు. ఇలాంటి నిర్ణయాలు ఈ రోజుల్లో అత్యంత దారుణమైనవన్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చైల్డ్ ఫ్రీ ట్రావెల్ పై జోరుగా చర్చ జరుగుతోంది. కొంత మంది రైల్వే నిర్ణయానికి మద్దతు పలుకుతున్నారు. రైళ్లతో పాటు విమానాల్లోనూ పిల్లలకు ఎంట్రీ లేని క్లాస్ లను తీసుకురావాలంటున్నారు. ఈ నిరసనల నేపథ్యంలో ఫ్రెంచ్ రైల్వే స్పందించింది. ఇది వ్యాపార కస్టమర్ల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చినట్లు తెలిపింది.
Read Also: రైలు మిస్ అయ్యిందా? డోంట్ వర్రీ.. ఫుల్ రీఫండ్ పొందవచ్చు, ఎలాగో తెలుసా?