Ashwini Vaishnaw: కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రైల్వే కేటాయింపులు, ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల వివరాలను వెల్లడించారు. ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రికార్డు స్థాయిలో రూ. 10,100 కోట్ల నిధులు కేటాయించామని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఏపీలో రూ. 92,649 కోట్ల విలువైన రైల్వే పనులు పురోగతిలో ఉన్నాయని, సుమారు 73 రైల్వే స్టేషన్లను పునర్నిర్మాణం చేస్తున్నామని పేర్కొన్నారు. కోల్కతా నుంచి చెన్నై వరకు నాలుగు లైన్ల రైల్వే పనులు శరవేగంగా జరుగుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వంతో పూర్తి సమన్వయంతో ముందుకు వెళ్తున్నామని వివరించారు.
తెలంగాణ విషయానికి వస్తే, రైల్వే రంగం కోసం రూ. 5,454 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. గత యూపీఏ ప్రభుత్వ హయాంతో పోలిస్తే ఇది 6 రెట్లు అధికమని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం తెలంగాణలో రూ. 47,984 కోట్ల విలువైన రైల్వే పనులు కొనసాగుతున్నాయి. తెలంగాణకు గేమ్ చేంజర్గా మారబోతున్న మూడు బుల్లెట్ రైలు కారిడర్లను ప్రభుత్వం మంజూరు చేసింది. హైదరాబాద్ – చెన్నై, హైదరాబాద్ – బెంగళూరు, హైదరాబాద్ – పూణే మధ్య ఈ హైస్పీడ్ రైళ్లు నడవనున్నాయి. దీనివల్ల హైదరాబాద్ నుంచి పూణేకు 1 గంట 54 నిమిషాల్లో, బెంగళూరుకు 2 గంటల్లో, చెన్నైకి 2 గంటల 55 నిమిషాల్లో చేరుకోవచ్చని ఆయన తెలిపారు.
బుల్లెట్ రైలు ప్రాజెక్టులకు సంబంధించి డిజైన్, డీపీఆర్ (DPR) సిద్ధమైన తర్వాత పనులు ప్రారంభమవుతాయని, ఇవి గంటకు 350 కి.మీ వేగంతో ప్రయాణిస్తాయని మంత్రి వివరించారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుపై స్పందిస్తూ, ఇది అత్యంత జటిలమైన ప్రక్రియ అని, సిబ్బంది మార్పు, కంట్రోల్ కమాండ్స్, టైం టేబుల్ మార్పులు చేయాల్సి ఉంటుందని చెప్పారు. సాధారణంగా కొత్త జోన్ ఏర్పాటుకు 3 నుంచి 4 ఏళ్ల సమయం పడుతుందని, అయితే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో సమన్వయం చేసుకుంటూ ఈ పనులను ఫాస్ట్ ట్రాక్లో చేస్తున్నామని తెలిపారు. విశాఖపట్నంలో సౌత్ కోస్టల్ జోన్ కార్యాలయ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని ఆయన భరోసా ఇచ్చారు
Read Also: Hayathnagar: ప్రయాణికుల ప్రాణాలకు భరోసా ఏదీ.. లబోదిబో మంటున్న ఆ ప్రాంత ప్రజలు..?