New Ladakh Scheme: లడఖ్ అందాలను చూడాలని చాలా మందికి కోరిక ఉంటుంది. కానీ, అక్కడికి వెళ్లాలంటే ప్రయాణ ఖర్చులు ఎక్కువగా ఉండటంతో చాలామంది వెనుకాడుతుంటారు. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని బీహార్ ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. లడఖ్ ను సందర్శించే రాష్ట్ర ప్రజలకు ఆర్థిక సాయం అందించే ప్రత్యేక పథకాన్ని ప్రారంభించింది.
‘సింధు దర్శన్ యాత్రకు గ్రాంట్’ పేరుతో ఈ కొత్త పథకానికి బీహార్ కేబినెట్ తాజాగా ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద లడఖ్ యాత్ర చేసే అర్హులైన బీహార్ వాసులకు గరిష్ఠంగా రూ.20,000 వరకు ఆర్థిక సహాయం అందించనున్నారు. అయితే, ఈ డబ్బు ముందుగానే ఇవ్వరు. ముందుగా టూరిస్టులు తమ సొంత ఖర్చుతో లడఖ్ వెళ్లి రావాలి. ఆ తర్వాత అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు పరిశీలించిన తర్వాత ప్రభుత్వం ప్రయాణ ఖర్చులో సగం మొత్తాన్ని లేదంటే, రూ.20,000ను, ఈ రెండింటిలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తుంది.
ఈ పథకాన్ని పొందడానికి కొన్ని నిబంధనలను తీసుకొచ్చింది ప్రభుత్వం. దరఖాస్తు చేసుకునే వ్యక్తి తప్పనిసరిగా బీహార్ రాష్ట్రానికి చెందిన నివాసి అయి ఉండాలి. అతడి వయసు 18 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ ఉండాలి. మైనర్లకు ఈ పథకం వర్తించదు. ప్రారంభ దశలో ఈ పథకాన్ని పరిమిత సంఖ్యలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ప్రతి ఏడాది కేవలం 100 మంది యాత్రికులకు మాత్రమే ఈ గ్రాంట్ అందించనున్నారు. భవిష్యత్తులో దీనిని విస్తరించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
లడఖ్ కేవలం ఒక పర్యాటక ప్రాంతం మాత్రమే కాదు. దీనికి భారతీయ సంస్కృతి, చరిత్రలో కూడా ప్రత్యేక స్థానం ఉంది. ప్రపంచ ప్రసిద్ధ సింధు నది లడఖ్ గుండా ప్రవహిస్తుంది. ఈ నది భారతీయ నాగరికతకు ప్రతీకగా భావిస్తారు. ప్రతి ఏడాది లేహ్ సమీపంలోని సింధు ఘాట్ లో ‘సింధు దర్శన్’ ఉత్సవం కూడా నిర్వహిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు, పర్యాటకులు ఈ వేడుకలకు హాజరవుతుంటారు.
గత కొన్ని సంవత్సరాలుగా లడఖ్కు వెళ్లే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. రహదారి సౌకర్యాలు, పర్యాటక మౌలిక వసతులు కూడా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఒకప్పుడు చాలా కష్టంగా భావించిన లడఖ్ యాత్ర ఇప్పుడు సులభంగా మారింది.
అటు పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు బీహార్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. రాష్ట్రంలో కొత్త హెలికాప్టర్ తో ఎయిర్ టూరిజం సేవలను ప్రారంభించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ హెలికాప్టర్ సేవలు పాట్నా నగరాన్ని రాజ్ గిర్, కైమూర్, వాల్మీకినగర్ ప్రాంతాలతో అనుసంధానం చేయనున్నాయి. ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా ఛార్జీలు కూడా నిర్ణయించారు. అలాగే పాట్నాలో హెలికాప్టర్ జాయ్ రైడ్లను కూడా ప్రారంభించనున్నారు. పది నిమిషాల ప్రయాణానికి ఒక్కొక్కరికి రూ.2,100గా ధర నిర్ణయించారు.
Read Also: వందే భారత్ ఎక్స్ ప్రెస్ అసలు పేరు ఏంటో తెలుసా? ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ తప్పకుండా తెలుసుకోవాల్సిందే!