విమాన ప్రయాణం చేసే సమయంలో ప్రయాణీకులు తీసుకెళ్లకూడని కొన్ని వస్తువులు ఉంటాయి. ఆ లిస్టులో కొబ్బరికాయ కూడా ఉంటుంది. కానీ, ఇప్పటి వరకు శబరికి వెళ్లే అయ్యప్ప భక్తులు ఈ నిబంధనలకు అనుగుణంగా ప్రయాణం చేయాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు అయ్యప్ప భక్తుల విషయంలో పౌరవిమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విమానంలో శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులు తమతో పాటు కొబ్బరికాయతో కూడిన ఇరుముడిని తీసుకెళ్లేలా ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పౌరవిమానయాన శాఖ ప్రకటన విడుదల చేసింది.
ఇప్పటివరకు అమలులో ఉన్న విమాన భద్రతా నియమావళి ప్రకారం ఇరుముడిని తప్పనిసరిగా చెక్ ఇన్ లగేజీగా పంపాల్సిరావడం వల్ల భక్తులు కొంత అసౌకర్యాన్ని ఎదుర్కొన్నారు. ఈ సమస్యపై దృష్టి సారించిన పౌర విమానయానశాఖ.. భక్తుల విశ్వాసాలను పరిగణనలోకి తీసుకుని.. అయ్యప్ప స్వాముల కోసం ప్రత్యేక మినహాయింపు అమలు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు.
ఈ ప్రత్యేక సడలింపు ఇవాళ్టి నుంచి నుంచి జనవరి 20 వరకు దేశ వ్యాప్తంగా వర్తిస్తుందని విమానయానశాఖ అధికారులు తెలిపారు. ఈ సమయంలో శబరిమల యాత్రకు వెళ్లే భక్తులు, ఎయిర్ పోర్టు భద్రతా తనిఖీలను పూర్తి చేసిన అనంతరం, తమ ఇరుముడిని హ్యాండ్ లగేజీగా విమాన క్యాబిన్ లో తమతో పాటు తీసుకెళ్లవచ్చని తెలిపారు.
Read Also: విశాఖపట్నం నుంచి బయల్దేరే రైళ్లు దారి మళ్లింపు, కారణం ఏంటంటే?
అటు భక్తులు ఎయిర్ పోర్టు భద్రతా సిబ్బందికి పూర్తిగా సహకరించి, ప్రత్యేకంగా అమల్లోకి తీసుకొచ్చిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని రామ్మోహన్ నాయుడు విజ్ఞప్తి చేశారు. ఇరుముడి స్క్రీనింగ్, తనిఖీ ప్రక్రియల విషయంలో అధికారుల సూచనలను కచ్చితంగా అనుసరించాలన్నారు. శబరిమల యాత్ర పవిత్రతకు ఏమాత్రం భంగం కలగకుండా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. అయ్యప్ప భక్తుల దీక్ష, భక్తి, ఆచార వ్యవహారాల పట్ల గౌరవంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు. దేశ నలుమూలల నుంచి విమానాలలో శబరికి వచ్చే భక్తులకు ఈ ప్రత్యేక నిబంధనలు వర్తిస్తాయని ఆయన చెప్పారు. భక్తులందరికీ అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉండాలని, స్వామివారి అనుగ్రహంతో దేశ సుభిక్షంగా ఉండాలని రామ్మోహన్ నాయుడు ఆకాంక్షించారు.
Read Also: అమృత్ భారత్ రైళ్లలోనూ ఏసీ కోచ్ లు, రైల్వే కీలక నిర్ణయం!