Chenab Railway Bridge: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసుకుంది. చీనాబ్ నదిపై భారతీయ రైల్వే సంస్థ నిర్మించిన ఈ బ్రిడ్జి త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ వంతెన మీదుగా రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. తాజాగా ఈ బ్రిడ్జి మీద నిర్వహించిన ట్రయల్ రన్ సక్సెస్ అయ్యింది. ఏ చిన్న ఇబ్బంది ఎదురు కాలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. త్వరలోనే ఈ బ్రిడ్జి ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. జమ్మూకాశ్మీర్ లోని రాంబన్- సాంగల్దాన్ జిల్లాలను కలుపుతూ చీనాబ్ నది మీద ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. దీని ద్వారా రాంబన్ నుంచి రియాసికి రైలు సర్వీసులు నడవనున్నాయి. ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న ఈ బ్రిడ్జి త్వరలో అందుబాటులోకి రావడంతో పాటు జమ్మూకాశ్మీర్ లోని పర్యాటక ప్రదేశాల్లో ఒకటిగా నిలువనుంది.
359 మీటర్ల ఎత్తులో రైల్వే బ్రిడ్జి నిర్మాణం
జమ్మూకాశ్మీర్ కు దేశంలోని ఇతర ప్రాంతాలకు రైల్వే కనెక్టివీటిని పెంచేందుకు ఉధంపూర్- శ్రీనగర్- బారాముల్లా రైల్వే ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అందులో భాగంగా చీనాబ్ నది మీద ఈ బ్రిడ్జిని నిర్మించారు. చీనాబ్ నది లోపలి నుంచి 359 మీటర్ల ఎత్తులో ఈ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. దీని పొడవు 1,315 మీటర్లు. అంటే.. సుమారు 1.3 కిలో మీటర్లు. ఈ రైల్వే బ్రిడ్జి మానవ నిర్మిత కట్టడాల్లో అత్యంత అరుదైనదిగా గుర్తింపు తెచ్చుకుంది.
#JammuAndKashmir | Indian Railway conducts trial run over world’s highest railway bridge ‘Chenab’
The bridge is built between #Sangaldan in #Ramban district and #Reasi.
Rail services on the line will start soon.@RailMinIndia @RailwayNorthern @AshwiniVaishnaw pic.twitter.com/cV1282VT4G
— DD News (@DDNewslive) June 20, 2024
చైనా రికార్డును బద్దలు కొట్టిన భారత్
ఇప్పటి వరకు చైనాలోని బెయిపాన్ నదిపై 275 మీటర్ల ఎత్తులో షూబాయ్ బ్రిడ్జిని నిర్మించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో నిర్మించిన బ్రిడ్జిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు భారతీయ రైల్వే సంస్థ చీనాబ్ నది మీద నిర్మించిన బ్రిడ్జి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిగా రికార్డు నెలకొల్పింది. ఈ బ్రిడ్జి పారిస్ లోని ఈఫిల్ టవర్ కంటే 30 మీటర్లు ఎక్కువ ఎత్తులో ఉండటం విశేషం. ప్రపంచంలోనే ఎత్తైన ఈ బ్రిడ్జి ప్రపంచ ఎనిమిదో వింతగా గుర్తింపు పొందే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ బ్రిడ్జి భారతీయ ఇంజినీర్ల ప్రతిభకు నిదర్శంగా అభివర్ణించారు.
త్వరలో న్యూఢిల్లీ-కాశ్మీర్ వందేభారత్ స్లీపర్ రైలు ప్రారంభం
జనవరి 2025లో తొలి వందేభారత్ స్లీపర్ రైలు పట్టాలు ఎక్కబోతున్నది. న్యూఢిల్లీ-శ్రీనగర్ నడుమ ఈ రైలు నడవనుంది. దేశ రాజధానితో జమ్మూకాశ్మీర్ కు రైల్వే కనెక్టివిటీని పెంచనుంది. ఈ వందేభారత్ రైలు కేవలం 13 గంటల్లో 800 కిలో మీటర్లు ప్రయాణించనుంది. ఢిల్లీలో రాత్రి 7 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు శ్రీనగర్ చేరుకుంటుంది. వందేభారత్ స్లీపర్ రైలు ప్రారంభం తర్వాత జమ్మూకాశ్మీర్ లో పర్యటకరంగం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. సందర్శకుల సంఖ్య గణనీయంగా పెరగనుంది. జమ్మూకాశ్మీర్ పర్యటక, ఆర్ధిక వ్యవస్థ మరింత బలపడనుంది. త్వరలోనే ప్రధాని మోడీ ఈ రైలును ప్రారంభించనున్నారు. ఈ రైలు చీనాబ్ నది మీద నిర్మించిన బ్రిడ్జి మీది నుంచి పరుగులు పెట్టనుంది.
Read Also: రైల్లో టీ తాగిన వారికి వాంతులు.. అందులో ఏం కలిపాడో తెలిసి అంతా షాక్!