దేశ వ్యాప్తంగా ఇండిగో విమాన సంస్థ పెద్ద సంఖ్యలో విమాన సర్వీసులు రద్దు చేయడంపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) దృష్టిసారించింది. విమానాల రద్దు, ఆలస్యంపై వివరణ ఇవ్వాలంటూ ఆ సంస్థకు సమన్లు జారీ చేసింది. వెంటనే తమ కార్యాలయానికి వచ్చి పూర్తి వివరాలు అందించాలని ఆదేశించింది. ఈ మేరకు DGCA కీలక ప్రకటన చేసింది.
దేశ వ్యాప్తంగా రెండు రోజులుగా ఇండిగో విమానాల సేవల్లో భారీ అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ సహా పెద్ద నగరాలకు రాకపోకలు కొనసాగించాల్సిన విమానాలు పెద్ద సంఖ్యలో క్యాన్సిల్ చేసింది. ఢిల్లీలో 30కి పైగా, హైదరాబాద్లో 33 విమానాలు రద్దు అయ్యాయి. బుధవారం నాడు నాలుగు ప్రధాన నగరాల్లో 200 విమానాలు రద్దు కాగా, గురువారం నాడు 170కి పైగా ఇండిగో ఫ్లైట్లు రద్దయ్యాయి. ప్రయాణీకులు పెద్ద సంఖ్యలో ఎయిర్ పోర్టులలో గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు. అత్యవసరంగా వెళ్లాల్సిన ప్రయాణీకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా, విమానాశ్రయాల్లో తమను ఇబ్బందులు పెడుతున్నారంటూ మండిపడుతున్నారు.
అటు దేశ వ్యాప్తంగా విమానాల రద్దుపై ఇండిగో కీలక ప్రకటన చేసింది. వింటర్ షెడ్యూల్ మార్పులు, వాతావరణ సమస్యలు, సాంకేతిక లోపాలతోనే విమానాలను రద్దు చేసినట్లు తెలిపింది. కొత్త FDTL నిబంధనలతో పైలట్ల కొరత పెరిగినట్లు తెలిపింది. షెడ్యూల్ సర్దుబాట్లు చేస్తూ కార్యకలాపాల పునరుద్ధరణకు చర్యలు చేపట్టినట్లు వివరించింది. అయితే, ఇందుకోసం సుమారు 48 గంటల సమయం పట్ట వచ్చని బుధవారం సాయంత్రం ప్రకటించింది.
గత నెలలోనూ ఇండిగో విమానాలు దేశ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రద్దు అయ్యాయి. నవంబరులో ఇండిగో ఆయా కారణాలతో ఏకంగా 1,232 విమానాలను రద్దు చేసింది. వీటిలో 258 విమానాలు ఎయిర్ స్పేస్ పరిమితుల వల్ల రద్దు అయినట్లు తెలిపింది. మరో 92 విమానాలు ATC వ్యవస్థ వైఫల్యంతో క్యాన్సిల్ అయినట్లు చెప్పింది.
Read Also: 55 ఇండిగో విమానాలు రద్దు, శంషాబాద్ ఎయిర్ పోర్టులో గందరగోళం!
దేశ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఇండిగో విమానాల రద్దుపై DGCA విచారణ మొదలు పెట్టింది. ఇండిగో సంస్థకు సమన్లు జారీ చేసింది. విమానాల రద్దు, ఆలస్యంపై వివరణ కోరింది. వీలైనంత త్వరగా ప్రయాణీకులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే విమానాయాన వ్యవస్థకు చెడ్డ పేరు వస్తుందని వెల్లడించింది.
Read Also: ఎయిర్ పోర్టులపై కొత్త కుట్ర, అదే జరిగితే ప్రయాణీకుల ప్రాణాలు గాల్లోనే..