దీపావళి సందర్భంగా ప్రయాణీకులతో రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్న నేపథ్యంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే (ECoR) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణీకుల అదనపు రద్దీని తగ్గించేందుకు విశాఖపట్నం- చర్లపల్లి మధ్య ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఒక్క ట్రిప్ కోసం ఈ రైలును అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు.
విశాఖపట్నం-చర్లపల్లి ప్రత్యేక రైలు(08541)కు సంబంధించిన షెడ్యూల్ ను ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారలు ప్రకటించారు. ఈ రైలు అక్టోబర్ 21న సాయంత్రం 5.30 గంటలకు విశాఖపట్నం నుంచి బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 8 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(08542) చర్లపల్లి-విశాఖపట్నం స్పెషల్ పేరుతో అక్టోబర్ 22న మధ్యాహ్నం 3.30 గంటలకు చర్లపల్లి నుంచి బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైల్లో జనరల్ క్లాస్ కోచ్లు, స్లీపర్ కోచ్లు, AC-3 టైర్ కోచ్లు, సెకండ్ క్లాస్ లగేజ్ కమ్ సిట్టింగ్ కోచ్లు ఉంటాయి.
విశాఖపట్నం- చర్లపల్లి మధ్య నడిచే ఈ ప్రత్యేక రైలు దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లె, పిడుగురాళ్ల, నడికుడలో రెండు వైపులా ఆగుతాయని రైల్వే అధికారులు వెల్లడించారు.
Read Also: గుడ్ న్యూస్, ఇక పోస్టాఫీసులోనూ రైల్వే టికెట్లు బుక్ చేసుకోవచ్చు.. ఇదిగో ఇలా!
ఇక ఈ ప్రత్యేక రైలుకు సంబంధించి ముందస్తు రిజర్వేషన్ ప్రారంభించినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు తెలిపారు. అన్ని PRS కేంద్రాలతో పాటు రైల్వే అధికారిక వెబ్ సైట్ లోనూ ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. ప్రయాణీకుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి, పండుగ సీజన్ లో ప్రయాణ అవసరాలను తీర్చడానికి ఈ సర్వీసులు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రయాణీకులు సౌకర్యవంతమైన ప్రయాణానికి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
Read Also: తప్పుడు వీడియోలు షేర్ చేస్తే కఠిన చర్యలు తప్పవు, రైల్వే సీరియస్ వార్నింగ్!