యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఈ) దేశంలో దుబాయ్ రాజ్యం ప్రపంచవ్యాప్తంగా టూరిజం కోసం ఫేమస్. దుబాయ్ ప్రభుత్వం తాజాగా పర్యాటకులకు, అక్కడి నివాసితులకు (రెసిడెంట్స్) లాభదాయకంగా ఒక కొత్త పథకం తీసుకొచ్చింది. ముఖ్యంగా పర్యాటక రంగానికి మరింత ప్రొత్సహించే అక్కడి నివాసితులు, యూఏఈ పౌరుల ఈ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ప్రొగ్రామ్ పేరు
‘ఎ దుబాయ్ ఇన్వైట్’ (A Dubai Invite). ఈ పథకం ద్వారా విదేశాల్లో ఉన్న కుటుంబ సభ్యులు లేదా స్నేహితులను దుబాయ్కు ఆహ్వానిస్తే ప్రత్యేక బహుమతులు లభిస్తాయి. అర్హత కలిగిన అతిథులు దుబాయ్కు వచ్చిన తర్వాత నివాసితులు 3,000 దిర్హామ్లకు పైగా విలువైన రివార్డ్ ప్యాకేజీని పొందవచ్చు. ఇందులో లగ్జరీ హోటల్ స్టేలు, డైనింగ్ ఆఫర్లు, పర్యాటక ఆకర్షణల టికెట్లు, లైఫ్స్టైల్ ఎక్స్పీరియన్స్ ఇన్సెంటివ్స్ ఉంటాయి.
ఈ కార్యక్రమాన్ని దుబాయ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకానమీ అండ్ టూరిజం ప్రారంభించింది. ప్రపంచం నలుమూలల నుంచి మరింత మంది పర్యాటకులను ఆకర్షించడమే దీని ప్రధాన లక్ష్యం. దుబాయ్లో నివసించే వారిని నగరానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మార్చి, వారి ద్వారా పర్యాటకాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని రూపొందించారు.
నివాసితులు ఆహ్వానించిన అతిథులు దుబాయ్కు చేరుకున్న తర్వాత వారికి ప్రత్యేక రివార్డ్లు అందిస్తారు.
ఈ పథకం కింద అర్హత పొందే అతిథులు 2026 జూలై 20 నుంచి అక్టోబర్ 31 మధ్య దుబాయ్కు రావాలి. అధికారులు వారి రాకను ధృవీకరించిన తర్వాత రివార్డ్ ప్యాకేజీ అందజేస్తారు.
రివార్డ్లను సాధారణంగా 2026 డిసెంబర్ 31 వరకు వినియోగించుకోవచ్చు. కొన్ని ఆఫర్లకు ప్రత్యేక గడువు ఉండే అవకాశం ఉంది. అందువల్ల ప్రతి ఆఫర్కు సంబంధించిన నిబంధనలు ముందుగా పరిశీలించడం మంచిది.
ఈ పథకంలో చేరడం చాలా సులభం. అతిథులు దుబాయ్కు రాకముందే దుబాయ్ లో ఉండే నివాసితులు.. అధికారిక ఆన్లైన్ నామినేషన్ ఫారమ్ను ఫిల్ చేయాలి.
ఒక ఫారమ్లో గరిష్టంగా అయిదుగురు అతిథులను నమోదు చేయవచ్చు. అవసరమైతే మరిన్ని ఫారమ్ల ద్వారా అదనపు అతిథులను కూడా నమోదు చేసుకోవచ్చు.
అతిథులు విమానం, సముద్ర మార్గం లేదా రోడ్డు మార్గం ద్వారా దుబాయ్కు చేరుకున్న తర్వాత వారి వివరాలను సిస్టమ్ ఆటోమెటిక్గా ధృవీకరిస్తుంది. ఎలాంటి అదనపు డాక్యుమెంట్స్ సమర్పించాల్సిన అవసరం ఉండదు.
ధృవీకరణ పూర్తైన 72 గంటల్లోపే రివార్డ్ వివరాలు, వాటిని ఎలా వినియోగించుకోవాలో తెలిపే సమాచారం ఈ – మెయిల్ ద్వారా పంపబడుతుంది.
ఈ పథకంలో పాల్గొనాలంటే దరఖాస్తుదారులు యూఏఈ పౌరులు లేదా 18 సంవత్సరాలు పైబడిన నివాసితులు అయి ఉండాలి. వారికి చెల్లుబాటు అయ్యే ఎమిరేట్స్ ఐడీ ఉండాలి.
ఆహ్వానించబడే అతిథులు యూఏఈ నివాసితులు కాకూడదు. వారు టూరిస్ట్ వీసాపై లేదా వీసా ఆన్ అరైవల్ సౌకర్యంతో దుబాయ్కు రావాలి.
వీసా పొందే బాధ్యత పూర్తిగా ప్రయాణికులదే. ఈ కార్యక్రమం వీసా సేవలను అందించదు.
ప్రతి విజయవంతమైన నామినేషన్కు 3,000 దిర్హామ్లకు పైగా, అంటే సుమారు రూ.79 వేల విలువైన రివార్డ్ ప్యాకేజీ లభిస్తుంది.
ఈ ప్యాకేజీలో లగ్జరీ హోటల్ బస, ప్రముఖ రెస్టారెంట్లలో డైనింగ్ ఆఫర్లు, ప్రధాన టూరిస్ట్ స్పాట్స్ ప్రవేశ టికెట్లు, ప్రత్యేక లైఫ్స్టైల్ అనుభవాలు ఉంటాయి.
అలాగే డబ్ల్యూ దుబాయ్ మీనా సేయాహి, ది వెస్టిన్ దుబాయ్ మీనా సేయాహి, లే మెరిడియన్ మీనా సేయాహి బీచ్ రిసార్ట్ అండ్ వాటర్పార్క్, మెలియా డెజర్ట్ పామ్, ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్, కరీమ్, హలా వంటి ప్రముఖ హోటల్, రవాణా, ఆతిథ్య సంస్థల నుంచి కూడా ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లు పొందే అవకాశం ఉంటుంది.
ప్రతి అతిథిని ఈ కార్యక్రమంలో ఒక్కసారి మాత్రమే నామినేట్ చేయవచ్చు. ఒకే వ్యక్తిని మరోసారి నమోదు చేస్తే ఆ దరఖాస్తు అర్హత కోల్పోతుంది.
ఒక నివాసితుడు గరిష్టంగా మూడు రివార్డ్ ప్యాకేజీలను మాత్రమే పొందగలరు. అంతకంటే ఎక్కువ మంది అతిథులను ఆహ్వానించినా అదనపు రివార్డ్లు లభించవు.
అందువల్ల అతిథులు దుబాయ్కు చేరుకునే ముందే నామినేషన్ ప్రక్రియను పూర్తి చేయడం అవసరం.
Also Read: గోవా కంటే బెటర్.. పర్యాటకులను ఆకట్టుకుంటున్న 5 కొత్త టూరిస్ట్ డెస్టినేషన్స్
ఇరాన్ యుద్ధం కారణంగా నష్టపోయిన పర్యాటక రంగాన్ని మళ్లీ ఆకర్షణీయంగా చేసేందుకు దుబాయ్ ప్రభుత్వం ఈ ఆఫర్ ప్రొగ్రామ్ లాంచ్ చేసింది. ‘ఎ దుబాయ్ ఇన్వైట్’ కార్యక్రమం ద్వారా దుబాయ్ పర్యాటక రంగానికి ప్రోత్సాహం లభిస్తుంది. అదే సమయంలో అక్కడి నివాసితులు విలువైన రివార్డ్లను పొందే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి దుబాయ్ అందాలను ఆస్వాదిస్తూ, ప్రత్యేక ప్రయోజనాలను కూడా పొందేందుకు ఈ పథకం మంచి అవకాశం.