Indian Railway Holi Special Trains: హోలీ పండుగ సందర్భంగా ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా భారతీయ రైల్వే తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నది. ప్రయాణీకులు సజావుగా, సురక్షితంగా, సౌకర్యవంతమైన ప్రయాణాలను కొనసాగించేలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నది. రద్దీకి అనుగుణంగా దేశ వ్యాప్తంగా పలు రైల్వే జోన్లలో 1,244 హోలీ స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 ఈ ప్రత్యేక సర్వీసులు నడుస్తాయని వెల్లడించింది. ప్రయాణీకుల డిమాండ్ను బట్టి ట్రిప్పుల సంఖ్య 1,500 వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
ప్రయాణీకుల రద్దీని ముందుగానే అంచనా వేసిన భారతీయ రైల్వే.. సాధారణ రైళ్లలో రద్దీని తగ్గించడానికి అదనపు సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది. హోలీ స్పెషల్ రైళ్లు దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాలు, రాష్ట్ర రాజధానులు, కీలక ప్రాంతీయ కేంద్రాలను కలుపుతాయని వెల్లడించింది. ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించనున్నట్లు వివరించింది.
సుదూర ప్రత్యేక సర్వీసులు ముంబై, పూణే, నాగ్ పూర్ లాంటి ప్రధాన కేంద్రాలను దానాపూర్, గోరఖ్పూర్, హజ్రత్ నిజాముద్దీన్, సమస్తిపూర్, బరౌని లాంటి గమ్యస్థానాలను ఈ రైళ్లు కలపనున్నాయి. విశాఖపట్నం, పూరి, భువనేశ్వర్ లాంటి తూర్పు, తీరప్రాంత కేంద్రాలలు షాలిమార్, పాట్నా, యశ్వంత్ పూర్, ధన్ బాద్ కు లింక్ చేయనున్నాయి. పాట్నా, దర్భంగా, సహర్సా, ధన్బాద్ లాంటి రైళ్లు బీహార్, జార్ఖండ్ నగరాలను కలపనున్నాయి. న్యూఢిల్లీ, ఆనంద్ విహార్ టెర్మినల్, చండీగఢ్, బెంగళూరులను కలిపేలా పలు రైళ్లు నడవనున్నాయి.
అటు తూర్పు, ఉత్తర కారిడార్లలో కూడా మెరుగైన కనెక్టివిటీని అందించేలా రైల్వే ప్లాన్ చేసింది. హౌరా, సీల్దా, కోల్ కతా, మాల్డా టౌన్ లాంటి స్టేషన్లతో పాటు రక్సౌల్, మధుబాని, గోరఖ్పూర్, ఆనంద్ విహార్ టెర్మినల్స్ కు అదనపు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. పండుగ సమయంలో ఢిల్లీ, వారణాసి, లక్నో, అయోధ్య కాంట్, హరిద్వార్, అమృత్ సర్, కతిహార్ కు మరిన్ని రైలు సర్వీసులు నడుస్తాయి.
ఇక సౌత్ ఇండియా నుంచి చెన్నై, ఎర్నాకులం, తిరువనంతపురం, కోయంబత్తూర్, సికింద్రాబాద్, తిరుపతి, బెంగళూరు నుంచి పాట్నా, బరౌని, ముజఫర్ పూర్, సంత్రాగచి, అజ్మీర్, జైపూర్ లాంటి ఉత్తర, తూర్పు గమ్యస్థానాలకు హోలీ స్పెషల్ రైళ్లు నడుస్తాయి. ముంబై సెంట్రల్, అహ్మదాబాద్, వడోదర, సూరత్, బాంద్రా టెర్మినస్ తో సహా పశ్చిమ భారతం, కాన్పూర్, కతిహార్, బనారస్, గోరఖ్పూర్, దర్భంగా, భాగల్పూర్లకు అదనపు రైళ్లు నడుస్తాయి.
Read Also: కన్ఫార్మ్ టికెట్ ఉన్నా, కష్టాలు తప్పలేదు.. మరీ ఇంత ఘోరమా?
ప్రయాణీకుల డిమాండ్ను పరిశీలించి, అవసరమైన చోట ఈ ప్రత్యేక రైలు సేవలను అందించాని అన్ని రైల్వే జోన్లకు భారతీయ రైల్వే సూచించింది. హోలీ స్పెషల్ రైళ్లు పండుగ రద్దీని సమర్థవంతంగా నిర్వహించడానికి, ప్రయాణీకులకు అసౌకర్యాన్ని తగ్గించడానికి ఉపయోగపడున్నట్లు తెలిపింది.
Read Also: జస్ట్ రూ.1450కే ప్లైట్ టికెట్.. ఎయిర్ ఇండియా క్రేజీ ఆఫర్!