Gajraj AI Alert System: రైలు పట్టాలపైకి ఏనుగులు రావడం వల్ల జరిగే ప్రమాదాలను తగ్గించేందుకు భారతీయ రైల్వే కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తోంది. ఇందుకోసం గజరాజ్ ఏఐ’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ టెక్నాలజీ ఏనుగులు పట్టాల దగ్గరకు వచ్చే విషయాన్ని లోకో పైలట్ కు ముందే చేరవేస్తోంది. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే, ముందుగానే సమాచారం అందించడం ద్వారా రైలు వేగాన్ని తగ్గించి ఏనుగుల ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తారు.
గజరాజ్ ఏఐలో డిస్ట్రిబ్యూటెడ్ అకౌస్టిక్ సెన్సింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. రైల్వే పట్టాల పక్కన ఇప్పటికే ఉన్న ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లనే ఇందులో సెన్సర్లుగా ఉపయోగిస్తారు. ఏనుగులు పట్టాల వైపు కదులుతున్నప్పుడు నేలలో, పరిసరాల్లో స్వల్ప ప్రకంపనలు ఏర్పడతాయి. ఫైబర్ కేబుళ్లు ఈ ప్రకంపనలను గుర్తిస్తాయి. ఆ డేటాను ఏఐ వ్యవస్థ విశ్లేషించి, అది ఏనుగుల కదలికకు సంబంధించినదా కాదా అనేది గుర్తిస్తుంది.
ఏనుగులు ప్రమాదకర ప్రాంతానికి చేరుకుంటున్నట్లు గుర్తించిన వెంటనే వ్యవస్థ రియల్టైమ్ అలర్ట్లను పంపుతుంది. లోకో పైలట్లు, స్టేషన్ మాస్టర్లు, రైల్వే కంట్రోల్ రూమ్లకు సమాచారం చేరుతుంది. దీంతో రైలు వేగాన్ని తగ్గించడం లేదంటే అవసరమైతే నిలిపివేయడం లాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. చీకట్లో హెడ్లైట్ల వెలుగులో ఏనుగులు కనిపించే సమయానికి స్పందించేందుకు చాలా తక్కువ సమయం మాత్రమే ఉండొచ్చు.
గజరాజ్ సురక్షగా పిలిచే ఈ వ్యవస్థను తొలుత ఈశాన్య ప్రాంతంలో ప్రయోగాత్మకంగా పరీక్షించారు. 2026 ఫిబ్రవరి నాటికి ఈ టెక్నాలజీ ఈశాన్య సరిహద్దు రైల్వే పరిధిలోని 141 కిలోమీటర్ల మార్గంలో అందుబాటులోకి వచ్చింది. ఇలాంటి వ్యవస్థలను దేశంలోని ఎనిమిది రైల్వే జోన్లలోని ఏనుగుల సంచారానికి ప్రమాదకరమైన ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు కూడా అనుమతులు ఇచ్చారు.
వేగంగా ప్రయాణిస్తున్న భారీ రైలు వెంటనే ఆగిపోవడం సాధ్యం కాదు. అత్యవసర బ్రేకులు వేసినా రైలు పూర్తిగా నిలిచేందుకు చాలా దూరం అవసరం కావచ్చు. అందుకే ఏనుగులు పట్టాలపైకి వచ్చిన తర్వాత గుర్తించడం కంటే, అవి పట్టాల వైపు వస్తున్నప్పుడే సమాచారం అందడం చాలా కీలకం. 2019-20 నుంచి 2023-24 మధ్య రైలు ఢీకొనడంతో 81 ఏనుగులు మరణించినట్లు కేంద్ర ప్రభుత్వం గతంలో వెల్లడించింది. 2025 డిసెంబర్లో అస్సాంలో జరిగిన ప్రమాదంలో ఏడు ఏనుగులు మరణించగా, మరొకటి గాయపడింది.
ఏనుగుల రక్షణ కోసం రైల్వే శాఖ అండర్పాస్లు, ఓవర్పాస్లు, స్పీడ్ రిస్ట్రిక్షన్స్, థర్మల్ కెమెరాలు, ఫైబర్ సెన్సర్లు లాంటి అనేక చర్యలు చేపడుతోంది. దేశవ్యాప్తంగా సున్నితమైన రైల్వే మార్గాలను గుర్తించి మరిన్ని రక్షణ చర్యలు చేపడుతున్నారు. అయితే, టెక్నాలజీ హెచ్చరిక ఇవ్వడం మాత్రమే సరిపోదు. సమాచారం అందిన వెంటనే లోకో పైలట్లు, స్టేషన్ సిబ్బంది, అటవీ అధికారులు సమన్వయంతో స్పందించాలి. అప్పుడే ఏనుగుల ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది.
Read Also: 7 అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు గ్రీన్ సిగ్నల్.. తెలుగు రాష్ట్రాలకు ఎన్ని రైళ్లు వస్తున్నాయంటే?