IRCTC Auto Upgradation: భారతీయ రైల్వే ప్రయాణీకులకు ఎప్పటికప్పుడు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. తక్కువ ధరలో ఆహ్లాదకరమైన ప్రయాణాలు చేసేందుకు కొత్త కొత్త నిబంధనలు తీసుకొస్తుంది. అందులో భాగంగానే స్లీపర్ క్లాస్ టికెట్ తో ఏసీ కోచ్ లో ప్రయాణించే అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం ఒక ప్రత్యేక సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దానిపేరే ఆటో అప్గ్రేడేషన్ స్కీమ్. ఇంతకీ ఈ పథకం ప్రత్యేకత ఏంటి? స్లీపర్ టికెట్ తో ఏసీ ప్రయాణం చేసేలా ఎలా ఉపయోగపడుతుంది? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
వాస్తవానికి, ఎక్కువ ఛార్జీల కారణంగా, రైళ్లలోని టాప్ క్లాస్ కోచ్ లు అయిన AC1, AC2 తరచుగా ఖాళీగా ఉంటాయి. ఈ ఖాళీ బెర్తుల కారణంగా రైల్వేకు పెద్ద మొత్తంలో నష్టం కలుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆ నష్టాన్ని నివారించేందుకు భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఆటో అప్గ్రేడ్ పథకాన్ని ప్రారంభించాయి. ఈ పథకం ప్రకారం ఏసీ కోచ్ లో బెర్త్ ఖాళీగా ఉంటే, దిగువ తరగతి నుంచి ప్రయాణీకుడిని పై తరగతికి అప్ గ్రేడ్ చేస్తారు.
ఒక రైలులో ఫస్ట్ ACలో నాలుగు ఖాళీ సీట్లు, సెకండ్ ACలో రెండు ఖాళీ సీట్లు ఉన్నాయని అనుకుందాం. సెకండ్ ACలోని కొంతమంది ప్రయాణీకులను ఫస్ట్ ACకి అప్గ్రేడ్ చేస్తారు. థర్డ్ ACలోని ప్రయాణీకులను సెకండ్ ACకి అప్గ్రేడ్ చేస్తారు. దీని వలన థర్డ్ ACలో కొన్ని సీట్లు ఖాళీగా ఉంటాయి. ఇది థర్డ్ ACలో వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న ప్రయాణీకులకు లాభం కలిగిస్తుంది. ఈ విధంగా రైలులోని ఏ కోచ్లోనూ బెర్తులు ఖాళీగా ఉండవు. రైల్వేకు నష్టం కలగదు.
టికెట్ బుక్ చేసుకునేటప్పుడు, ప్రయాణీకుడిని ఆటో అప్ గ్రేడ్ను అనుమతించడానికి సిద్ధంగా ఉన్నారా? అని IRCTC అడుగుతుంది. ‘అవును’ అనే ఆప్షన్ ను ఎంచుకుంటే మీ టికెట్ అప్ గ్రేడ్ చేయబడుతుంది. మీరు ‘లేదు’ సెలెక్ట్ చేస్తే పైతరగతులకు పంపే అవకాశం ఉండదు.
Read Also: జయహో పాట పాడేస్తున్న రోడ్డు.. ఇదేంది బాసూ ఇంత వింతగా ఉంది!
అప్ గ్రేడ్ తర్వాత ప్రయాణీకుడి PNR స్టేటస్ లో ఎలాంటి మార్పు ఉండదు. ప్రయాణీకులు ఏదైనా ప్రయాణ సంబంధిత సమాచారం కోసం వారి అసలు PNR స్టేటస్ ను ఉపయోగిస్తారు. అయితే, అప్ గ్రేడ్ తర్వాత వారు తమ టికెట్ను రద్దు చేసుకుంటే, అప్ గ్రేడ్ చేసిన తరగతి ఆధారంగా కాకుండా వారి అసలు టికెట్ ఆధారంగా వారికి రీఫండ్ లభిస్తుంది.
Read Also: ప్రయాణీకులకు గుడ్ న్యూస్, వందేభారత్ స్లీపర్ లో ఇక ఎమర్జెన్సీ కోటా టికెట్లు!