Australian High Commissioner Indian Train Journey: భారత్ లో విదేశీ దౌత్యవేత్తలు అధికారిక కార్యక్రమాలకు వెళ్లేటప్పుడు సాధారణంగా ప్రత్యేక వాహనాలు, భద్రతా ఏర్పాట్లు కనిపిస్తాయి. కానీ, ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. న్యూఢిల్లీ నుంచి చండీగఢ్కు వెళ్లేందుకు అధికారిక కాన్వాయ్ను పక్కనపెట్టి శతాబ్ది ఎక్స్ ప్రెస్ ను ఎంచుకున్నారు. ఆయన రైలు ప్రయాణానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకోవడంతో వైరల్గా మారింది.
రైలులో ప్రయాణించిన ఎక్స్ పీరియెన్స్ ను ఫిలిప్ గ్రీన్ ఎంతో ఆసక్తిగా వివరించారు. భారతదేశాన్ని నిజంగా అర్థం చేసుకోవాలంటే ప్రజలతో కలిసి ప్రయాణించాలని ఆయన అభిప్రాయపడ్డారు. రైలు ప్రయాణం ద్వారా దేశంలోని సాధారణ ప్రజల జీవన విధానాన్ని దగ్గరగా చూడగలమని చెప్పారు. తన ప్రయాణంలో తాను పూర్తిగా ఆనందించానని గ్రీన్ తెలిపారు. రైలులో ప్రయాణిస్తున్న సమయంలో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలను కలుసుకునే అవకాశం లభిస్తుందని, వారితో మాట్లాడటం కూడా ప్రత్యేకమైన అనుభూతి అని చెప్పుకొచ్చారు.
ఈ రైలు ప్రయాణం వెనుక ఒక ఆసక్తికరమైన కారణం కూడా ఉంది. 2026 మేలో ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ భారత్ లో పర్యటించిన సమయంలో భారతదేశాన్ని తెలుసుకోవాలంటే రైలు ప్రయాణం చేయాలని సూచించారు. ఆ మాటలు తనకు గుర్తుండిపోయాయని ఫిలిప్ గ్రీన్ చెప్పారు. అందుకే, అవకాశం వచ్చినప్పుడల్లా భారతీయ రైళ్లలో ప్రయాణించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈసారి శతాబ్ది ఎక్స్ ప్రెస్లో చండీగఢ్ చేరుకున్నట్లు వివరించారు.
భారతీయులతో మాట్లాడే సమయంలో క్రికెట్ ప్రస్తావన తప్పకుండా వస్తుందని గ్రీన్ సరదాగా చెప్పారు. కొన్నిసార్లు రైలులో ప్రయాణించే కుటుంబాలు కూడా తనతో మాట్లాడటమే కాకుండా ఫుడ్ కూడా పంచుకుంటాయని తెలిపారు. భారతీయుల ఆతిథ్యానికి ఇదొక చక్కటి ఉదాహరణగా ఆయన అభివర్ణించారు. రైలులో ప్రయాణిస్తే దేశాన్ని కేవలం బయట నుంచి చూసినట్టుగా కాకుండా, ప్రజల మధ్య నుంచి అనుభవించవచ్చని ఆయన చెప్పిన మాటలు సోషల్ మీడియాలో చాలామందిని ఆకట్టుకున్నాయి.
ఫిలిప్ గ్రీన్ చండీగఢ్ పర్యటన కేవలం రైలు ప్రయాణానికే పరిమితం కాలేదు. పంజాబ్, హర్యానా రాష్ట్రాలతో ఆస్ట్రేలియా సంబంధాలు, ద్వైపాక్షిక సహకారం లాంటి అంశాలపై ఆయన పలు అధికారిక సమావేశాల్లో పాల్గొన్నారు. హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనితో కూడా సమావేశమయ్యారు. అయితే, ఆయన పర్యటనలో అధికారిక కార్యక్రమాల కంటే రైలు ప్రయాణమే ఎక్కువగా చర్చనీయాంశమైంది. సాధారణ ప్రయాణికులతో కలిసి శతాబ్దిలో ప్రయాణిస్తూ భారతదేశాన్ని మరో కోణంలో చూడాలనుకున్న ఆయన నిర్ణయాన్ని నెటిజన్లు అభినందించారు. విదేశీ ప్రతినిధులు భారతదేశాన్ని సందర్శించినప్పుడు కేవలం అధికారిక సమావేశాలకే పరిమితం కాకుండా, ప్రజలతో కలిసి ప్రయాణించడం మంచి సందేశాన్ని ఇస్తుందని పలువురు వ్యాఖ్యానించారు.
My Prime Minister, @AlboMP, often says the best way to get to know 🇮🇳 is by travelling on its trains🚆. So it was fitting to arrive in Chandigarh by train – a journey I thoroughly enjoyed. Looking forward to exploring opportunities in Punjab & Haryana to further deepen 🇦🇺🇮🇳 ties. pic.twitter.com/55jPPStbAx
— Philip Green OAM (@AusHCIndia) September 9, 2026
Read Also: టాయ్ ట్రైన్ లో ప్రయాణం, టీ టేస్టీ.. డార్జిలింగ్ అందాలకు అమెరికా రాయబారి ఫిదా!