MMTS Train Services Cancelled: హైదరాబాద్ ఎంఎంటీఎస్ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. మెయింటెనెన్స్ పనుల కారణంగా ఇవాళ, రూపు(మే 11, 12 తేదీల్లో) పలు ఎంఎంటీఎస్ సర్వీసులను పూర్తిగా, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ రైళ్లలో ప్రయాణించే ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర ప్రయాణికులు ప్రత్యమ్నాయ ఏర్పాటు చేసుకోవాలన్నారు.
రైల్వే ట్రాక్ ల మరమ్మతులు, సిగ్నల్ వ్యవస్థ నిర్వహణ పనులు చేపడుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఆ పనులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైళ్లను రద్దు చేస్తున్నట్లు వివరించారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తాత్కాలికంగా కొన్ని సర్వీసులను నిలిపివేస్తున్నామన్నారు.
పూర్తిగా రద్దయిన రైళ్లలో ఉమ్దానగర్–లింగంపల్లి మధ్య నడిచే ట్రైన్ (నంబర్ 47164) ఉంది. అలాగే లింగంపల్లి–ఫలక్నుమా మధ్య నడిచే(47191) సర్వీస్ కూడా పూర్తిగా రద్దు చేశారు. ఫలక్ నుమా–లింగంపల్లి మధ్య నడిచే(47170), ఫలక్ నుమా–ఉమ్దానగర్ మధ్య నడిచే(47250) సర్వీసులను కూడా ఈ రెండు రోజుల పాటు నిలిపివేశారు.
ఇక కొన్ని రైళ్లు మాత్రం పూర్తి మార్గంలో కాకుండా కొంత దూరం వరకు మాత్రమే నడుస్తాయి. లింగంపల్లి నుంచి ఉమ్దానగర్కు వెళ్లే(47210) సర్వీస్ సికింద్రాబాద్–ఉమ్దానగర్ మధ్య రద్దు చేశారు. అటు ఉమ్దానగర్ నుంచి లింగంపల్లికి వెళ్లే(47203) సర్వీస్ ఉమ్దానగర్–సికింద్రాబాద్ మధ్య నడవదు. మరోవైపు లింగంపల్లి నుంచి ఫలక్ నుమాకు వెళ్లే(47179, 47190, 47187)రైళ్లు సికింద్రాబాద్–ఫలక్ నుమా మధ్య ప్రయాణించవు. ఈ నేపథ్యంలో ఆ మార్గాల్లో ప్రయాణించే వారికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.
హైదరాబాద్లో ఎంఎంటీఎస్ సేవలు ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, కాలేజీ విద్యార్థులు, రోజువారీ ఉద్యోగాలకు వెళ్లే ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఉదయం, సాయంత్రం సమయాల్లో భారీ సంఖ్యలో ప్రజలు ఈ రైళ్లను ఉపయోగిస్తుంటారు. ఇప్పుడు పలు సర్వీసులు రద్దు కావడంతో బస్సులు, మెట్రో లేదా ఇతర రవాణా మార్గాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రయాణికులు స్టేషన్కు బయలుదేరే ముందు తమ రైలు నడుస్తుందా? లేదా? అన్నది తప్పనిసరిగా చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. తాజా షెడ్యూల్ను రైల్వే అధికారిక వెబ్ సైట్ లేదంటే మొబైల్ సేవల ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు. అదనంగా 139 నంబర్కు SMS లేదా కాల్ చేసి కూడా రైళ్ల స్థితి గురించి సమాచారం పొందవచ్చన్నారు. రైల్వే కార్యకలాపాలు సజావుగా కొనసాగేందుకు, భద్రతా ప్రమాణాలను మెరుగుపరచేందుకు ఈ మెయింటెనెన్స్ పనులు చేస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
Read Also: ఇండియన్ బుల్లెట్ ట్రైన్ రెడీ.. గంటకు స్పీడ్ ఎంతో తెలుసా?