Indian Railway 100 Percent Electrification: ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థల్లో ఒకటైన భారతీయ రైల్వే అరుదైన గుర్తింపు తెచ్చుకోబోతోంది. త్వరలోనే వందశాతం విద్యుదీకరణ పూర్తి చేసుకోబోతోంది. ప్రపంచంలోనే ఏ దేశానికి సాధ్యం కాని ఘనతను పొందబోతోంది.నవంబర్ 2025 నాటికి బ్రాడ్ గేజ్ నెట్వర్క్ లో దాదాపు 99.2% విద్యుదీకరణ పూర్తి చేసుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిఫికేషన్ నెట్ వర్క్ లో ఒకటిగా అవతరించింది. ‘మిషన్ 100% విద్యుదీకరణ’లో భాగంగా రైల్వే సంస్థ డీజిల్ ఆధారిత నెట్ వర్క్ నుంచి వేగంగా ఎలక్ట్రిఫికేషన్ దిశగా అడుగులు వేస్తుంది. ఆధునీకరణతో పాటు కాలుష్య రహిత్ రైల్వేకు శ్రీకారం చుడుతోంది.
ఎలక్ట్రిక్ రైళ్లతో భారతీయుల ప్రయాణం 1925లో ప్రారంభమైంది. మొదటి ఎలక్ట్రిక్ రైలు 1500 వోల్ట్ DC వ్యవస్థను ఉపయోగించి బాంబే విక్టోరియా టెర్మినస్- కుర్లా హార్బర్ మధ్య నడిచింది. స్వాతంత్ర్యం వచ్చే నాటికి 388 రూట్ కిలోమీటర్లు (RKMలు) విస్తరించింది. ఆ తర్వాత నత్తనడక రైల్వే విద్యుదీకరణ కొనసాగింది. 2004- 2014 మధ్య విద్యుదీకరణ రోజుకు కేవలం 1.42 కి.మీ కొనసాగింది. 2019- 2025 వరకు రోజుకు 15 కి.మీ.లకు పైగా పెరిగింది. నవంబర్ 2025 నాటికి, మొత్తం 69,427 RKMల విద్యుదీకరణ జరిగింది. ప్రస్తుతం దాదాపు మొత్తం విద్యుదీకరణకు దగ్గరగా వచ్చింది.
దేశంలో బ్రాడ్ గేజ్ నెట్వర్క్ 70,001 RKMలను విస్తరించి ఉంది. 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పుడు పూర్తిగా విద్యుదీకరించబడ్డాయి.రాజస్థాన్, తమిళనాడు, కర్ణాటక, అస్సాం, గోవా రాష్ట్రాలు మాత్రమే పూర్తిగా విద్యుదీకరణ జరపుకోలేదు. ఈ రాష్ట్రాల్లో మొత్తం 574 RKMలు పెండింగ్ లో ఉన్నాయి. రాజస్థాన్ లో 93 RKM, తమిళనాడు 117 RKM, కర్ణాటక 151 RKM, అస్సాం 197 RKM, గోవా 16 RKM పూర్తి అయితే, దేశ వ్యాప్తంగా రైల్వే విద్యుదీకరణ పూర్తి అవుతుంది. దేశ వ్యాప్తంగా రైళ్లు గ్రీన్ ఎనర్జీతో నడవనున్నాయి.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 99.2% విద్యుదీకరించబడిన నెట్వర్క్ తో, భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే ప్రముఖ రైల్వే వ్యవస్థలలో ఒకటిగా మారింది. ప్రపంచంలో స్విట్జర్లాండ్ 100% విద్యుదీకరించబడిన రైల్వేలను నిర్వహిస్తోంది. చైనా 82%, స్పెయిన్ 67%, జపాన్ 64%, ఫ్రాన్స్ 60%, రష్యా 52%, యునైటెడ్ కింగ్డమ్ 39% విద్యుదీకరణ సాధించాయి. భారతీయ రైల్వే విద్యుదీకరణ తర్వాత బోలెడు లాభాలను పొందనుంది. డీజిల్ కంటే విద్యుత్ ట్రాక్షన్ దాదాపు 70% ఎక్కువ పొదుపుగా ఉంటుంది. ఇంధన ఖర్చులను తగ్గిస్తుంది. అదే సమయంలో కర్బన్ ఉద్గారాలను తగ్గిస్తుంది. ప్రయాణీకులు వేగవంతమైన, సున్నితమైన, నిశ్శబ్ద ప్రయాణాలను పొందే అవకాశం ఉంటుంది.
Read Also: లోకల్ ప్రయాణికులకు షాక్.. UTS యాప్ బంద్, ఇక ఆ కొత్త యాప్లోనే అన్నీ!
దేశ వ్యాప్తంగా కేవలం 574 RKMలు విద్యుదీకరణ మాత్రమే పెండింగ్లో ఉన్నందున, భారతీయ రైల్వే మరికొద్ది రోజుల్లోనే పూర్తి చేయనుంది. ఆ తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ఆధునిక రైల్వే నెట్వర్క్ లలో ఒకటి కానుంది.
Read Also: ఫస్ట్ హైడ్రోజన్ ట్రైన్ వచ్చేస్తోంది, ఒకేసారి ఎంత మందిని తీసుకెళ్తుందంటే?