Railone App – UTS: ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించేందుకు భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. అందులో భాగంగానే కొత్త కొత్త రూల్స్ తీసుకురావడంతో పాటు కొన్ని సర్వీసులను నిలిపివేస్తోంది. తాజాగా రైల్వే టికెట్స్ బుకింగ్ కు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. జనరల్ టికెట్ల బుకింగ్ కోసం ఉపయోగించే UTS మొబైల్ యాప్ సేవలను నిలిపివేయాలని నిర్ణయించింది. మార్చి 1 ఈ సర్వీసులను పూర్తిగా ఆపివేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రైల్వే బోర్డు అధికారిక ప్రకటన చేసింది. రిజర్వ్ చేయని టికెట్లను బుక్ చేసుకోవడానికి ఇకపై RailOne యాప్ ను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది.
వాస్తవానికి గతంలో రకరకాల రైల్వే సేవల కోసం రకరకాల యాప్ లు ఉండేవి. ప్రయాణీకులకు ఒక్కో యాప్ లో ఒక్కో సర్వీస్ పొందాలంటే ఇబ్బంది పడేవారు. అన్ని సేవలను ఒకే గొడుగు కిందికి తీసుకురావాలనే ఉద్దేశంతో భారతీయ రైల్వే రైల్ వన్ యాప్ ను తీసుకొచ్చింది. ఇందులో అన్ని రైల్వే సేవలను అందించేలా ఏర్పాట్లు చేసింది. ఇకపై రిజర్వేషన్ టికెట్లతో పాటు జనరల్ టికెట్లను కూడా రైల్ వన్ యాప్ ద్వారానే బుక్ చేసుకోవాలని ప్రయాణీకులకు రైల్వే సూచించింది. అదే సమయంలో రైల్ వన్ యాప్ ద్వారా టికెట్లను బుక్ చేసుకునేలా ప్రోత్సహించేలా రైల్వే ఓ ఆఫర్ ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. రైల్ వన్ యాప్ లో టికెట్ బుక్ చేసుకునే వారికి మూడు శాతం తగ్గింపు అందించనున్నట్లు ప్రకటించింది.
టికెట్ల బుకింగ్ పై డిస్కౌంట్ పథకం జనవరి 14 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు భారతీయ రైల్వే కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే రైల్ వన్ యాప్ గురించి దేశ వ్యాప్తంగా వినియోగదారులకు అవగాహనక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అన్ని జోన్లలోని రైల్వే స్టేషన్లలో అవగాహన కల్పిస్తున్నారు. రైల్ వన్ యాప్ను ప్రజల మొబైల్ ఫోన్లలో రైల్వే అధికారులు డౌన్ లోడ్ చేసి ఇస్తున్నారు. ఇప్పటికే రైల్వే UTS యాప్ నుంచి నెలవారీ పాస్లను బుక్ చేసుకునే అవకాశాన్ని తొలగించింది. మార్చి 1 నుంచి UTS యాప్ పూర్తిగా పని చేయడం ఆగిపోతుందని తెలిపింది.
ఇకపై రైల్ వన్ యాప్ ద్వారానే ప్రయాణీకులు అన్ని సేవలను పొందే అవకాశం ఉందని రైల్వే అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు రైల్వే సేవల కోసం ఉపయోగిస్తున్న అన్ని రకాల యాప్ లను తొలగించి, కేవలం రైల్ వన్ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకుంటే సరిపోతుందన్నారు. రిజర్వేషన్ టికెట్లు, జనరల్ టికెట్లు, ప్లాట్ ఫారమ్ టికెట్లు, టికెట్ క్యాన్సిలేషన్, ఫుడ్ బుకింగ్ సహా అన్ని సర్వీసులను రైల్ వన్ నుంచి పొందే అవకాశం ఉందంటున్నారు. రైల్ వన్ యాప్ గురించి ఏమైనా అనుమానాలు ఉంటే అధికారులను అడిగి తెలుసుకోవచ్చన్నారు. ఇకపై అన్ని రైల్వే సేవలను ఈ యాప్ ద్వారానే కొనసాగుతాయని వెల్లడించారు.
Read Also: ఒడియమ్మ.. టికెట్ లేకుండా ఏకంగా వందే భారత్ రైల్లో ప్రయాణం, వామ్మో ఇంత మందా?