Indian Railways: ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత భారతీయ రైల్వేపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రైల్వే వ్యవస్థగా కొనసాగుతున్నప్పటికీ, టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో వెనుకబడి ఉండటాన్ని గమనించారు. ఇతర దేశాల్లో హైస్పీడ్ రైళ్లు అందుబాటులోకి వస్తే, మన దేశంలో కనీసం సెమీ హైస్పీడ్ రైళ్లు కూడా లేకపోవడంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్ లో కచ్చితంగా సెమీ హైస్పీడ్ రైళ్లు ఉండాలని రైల్వే అధికారులను ఆదేశించారు. అవసరమైన బడ్జెట్ కేటాయించారు. ఈ నేపథ్యంలో వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ రైళ్లు ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తున్నాయి. త్వరలో హైడ్రోజన్ రైలు కూడా పట్టాలెక్కబోతోంది.
రూ. 7,927 కోట్లతో 3 రైల్వే ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్
తాజాగా మరో కీలక నిర్ణయాన్ని వెల్లడించింది కేంద్రప్రభుత్వం. ఏకంగా రూ. 7, 927 కోట్లతో మూడు మెగా రైల్వే ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మూడు ప్రాజెక్టులు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లోని ఏడు జిల్లాలను కవర్ చేస్తాయి. అంతేకాదు, ఇప్పుడున్న భారతీయ రైల్వే నెట్ వర్క్ కు 639 కిలో మీటర్ల పరిధిని పెంచనున్నాయి. ఈ మూడు ప్రాజెక్టులలో మొదటిది జల్గావ్-మన్మాడ్ నడుమ నాలుగో లైన్ నిర్మించనున్నారు. అటు బుసావాల్-ఖాండ్వా నడుమ మూడు, నాలుగో లైన్ ను నిర్మించనున్నారు. అటు ప్రయాగ్రాజ్(ఇరదత్గంజ్)-మాణిక్పూర్ నడుమ మూడవ లైన్ ను ఏర్పాటు చేయనున్నారు.
పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు పెరగనున్న కనెక్టివిటీ
ఈ రైల్వే ప్రాజెక్టులతో నాసిక్ (త్రయంబకేశ్వర్), ఖాండ్వా (ఓంకారేశ్వర్), వారణాసి (కాశీ విశ్వనాథ్)లోని జ్యోతిర్లింగాలకు వెళ్లే యాత్రికులకు మరింత మేలు కలగనుంది. అదనపు రైళ్లను ఏర్పాటు చేయడం వల్ల ముంబై- ప్రయాగ్రాజ్-వారణాసి మార్గంలో కనెక్టివిటీని మెరుగుపరచనున్నాయి. ప్రయాగ్రాజ్, చిత్రకూట్, గయా, షిర్డీకి వెళ్లే భక్తులకు మరింత ఈజీ కానుంది. అటు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలైన ఖజురహో, అజంతా- ఎల్లోరా గుహలు, దేవగిరి కోట, అసిర్గఢ్ కోట, రేవా ఫోర్ట్, యావల్ అభయారణ్యం, కియోటి జలపాతం లాంటి పర్యాటక ప్రదేశాలు మరింత అభివృద్ధి చెందనున్నాయి. అంతేకాదు, వ్యవసాయోత్పత్తులు, ఎరువులు, బొగ్గు, ఉక్కు, సిమెంట్ రవాణా మరింత సులభం కానుంది.
విశాఖ రైల్వే జోక్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
అటు అక్టోబర్ లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్లోని ఎనిమిది జిల్లాలను కవర్ చేసే రెండు రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తాజాగా విశాఖ రైల్వే జోన్ కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుమారు రూ. 149 కోట్ల వ్యయంతో నిర్మించే విశాఖ రైల్వే జోన్ కార్యాలయ నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించింది. ఈ నెల 29న ఈ నిర్మాణానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. అటు ఈ టెండర్ బిడ్డింగ్ ప్రక్రియ డిసెంబర్ 13న ప్రారంభమై.. డిసెంబర్ 27 వరకు కొనసాగనుంది. టెండర్ దక్కించుకున్న సంస్థ రెండు సంవత్సరాల్లో ప్రాజెక్ట్ పూర్తి చేయాల్సి ఉంటుంది.
Read Also: మీ కోచ్ లో టాయిలెట్ కంపు కొడుతుందా? క్షణాల్లో క్లీన్ చేయించుకోండి ఇలా!