భారతీయ రైల్వేలో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు అత్యాధునిక ప్రయాణ అనుభవాన్ని అందిస్తున్నాయి. వేగంతో పాటు సౌకర్యవంతంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా సుమారు 145కు పైగా వందేభారత్ రైళ్లు సర్వీసులు అందిస్తున్నాయి. ఈ రైళ్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడిన నేపథ్యంలో పలు రైళ్లకు కోచ్ ల సంఖ్యలను పెంచుతూ తాజాగా ఇండియన్ రైల్వే నిర్ణయం తీసుకుంది.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పలు వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ మరో గుడ్ న్యూస్ చెప్పారు. హైదరాబాద్ నుంచి మరో రెండు వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. ఈ రైళ్లు హైదరాబాద్ నుంచి పూణే, నాందేడ్ కు రాకపోకలు కొనసాగిస్తాయన్నారు. “ఇప్పటికే 5 వందే భారత్ రైళ్లు తిరుగుతుండగా, మరో రెండు రైళ్లను నడపాలనే ప్రతిపాదనలూ సిద్ధమయ్యాయి. వాటిపైనా త్వరలోనే రైల్వే శాఖ సానుకూల నిర్ణయం తీసుకోబోతోంది” అన్నారు.
తాజాగా నాగ్ పూర్- సికింద్రాబాద్ మధ్య నడిచే వందే భారత్ రైలు హాల్టింగ్ సదుపాయాన్ని.. మంచిర్యాల రైల్వే స్టేషన్లో మంత్రి గడ్డం వివేక్, ఎంపీ గడ్డం వంశీ, ఎమ్మెల్సీ అంజి రెడ్డి, దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం గోపాల కృష్ణ సమక్షంలో బండి సంజయ్ కుమార్ వందే భారత్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, ప్రభుత్వం విమానాశ్రయాలతో సమానంగా ప్రపంచ స్థాయి సౌకర్యాలతో రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తుందన్నారు. అమృత్ భారత్ పథకం కింద మంచిర్యాల రైల్వే స్టేషన్ ను రూ. 26 కోట్లతో అప్ గ్రేడ్ చేస్తున్నట్లు తెలిపారు. రూ.3.5 కోట్లతో స్టేషన్ లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.
గత 10 సంవత్సరాలలో తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల కోసం కేంద్రం రూ.42,000 కోట్లు ఖర్చు చేసిందని బండి సంజయ్ వెల్లడించారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 41 రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయడానికి వచ్చే దశాబ్దంలో రూ.80,000 కోట్లు కేటాయిస్తుందని ఆయన చెప్పారు.
నాగ్ పూర్- సికింద్రాబాద్ మధ్య నడిచే వందే భారత్ రైలు హాల్టింగ్ సదుపాయాన్ని మంచిర్యాలలో నేడు ఉదయ ప్రారంభించడం జరిగింది. 2019 ఫిబ్రవరిలో గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారు ప్రారంభించిన చారిత్రాత్మక ‘వందే భారత్’ రైళ్లు నవ భారతంలో నూతన అధ్యాయానికి తెర తీసిందనే చెప్పాలి.… pic.twitter.com/H9tZFJJmSr
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) September 15, 2025
అటు మంచిర్యాల రైల్వే స్టేషన్ లో కేరళ ఎక్స్ ప్రెస్ ను ఆపడానికి వీలు కల్పించాలని మంత్రి వివేక్.. బండి సంజయ్ కుమార్ ను అభ్యర్థించారు. ప్రతి సంవత్సరం శబరిమలకి పెద్ద సంఖ్యలో భక్తులు ప్రయాణిస్తారని, వారందరికీ ప్రయోజనం చేకూర్చేందుకు నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో ఈ రైలు ఆపేలా చర్యలు తీసుకోవాలన్నారు. అటు మంచిర్యాల దగ్గర వందే భారత్ రైలును ఆపడానికి ఆమోదం తెలిపినందుకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు ఎంపీ గడ్డం వంశీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాంత ప్రజల కోరికమేరకు ఈ నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు చెప్పారు.
Read Also: దీపావళికి ఏకంగా 1,126 ప్రత్యేక రైళ్లు.. ఏయే రూట్లలో అంటే?