AI Surveillance in Traisn: భారతీయ రైల్వే ప్రయాణికుల భద్రతను మరింత పెంచేందుకు అధికారులు కీలక చర్యలకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా రైళ్లు, రైల్వే స్టేషన్లలో నేరాలను అరికట్టడంతో పాటు మాదకద్రవ్యాల అక్రమ రవాణాను పూర్తిగా నియంత్రించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆధునిక నిఘా సాంకేతికతలను విస్తృతంగా ఉపయోగించాలని నిర్ణయించారు.
అహ్మదాబాద్ లో నిర్వహించిన పశ్చిమ రైల్వే నేర నియంత్రణ సదస్సులో గుజరాత్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (సీఐడీ క్రైమ్ అండ్ రైల్వేస్) డాక్టర్ కె.ఎల్.ఎన్. రావు కీలక అంశాలు వెల్లడించారు. ప్రయాణికులకు సురక్షితమైన వాతావరణం కల్పించేందుకు అవసరమైన చర్యలను వేగంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుల స్వీకరణ, కేసుల పరిష్కారాన్ని మరింత సులభతరం చేయడానికి ఈ ఎఫ్ఐఆర్ విధానాన్ని బలోపేతం చేయాలని డీజీపీ సూచించారు. ప్రయాణికులు పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఫిర్యాదులను వేగంగా నమోదు చేసుకునేలా ప్రక్రియను మరింత సులభతరం చేయాలని అధికారులకు సూచించినట్లు సమాచారం. రైల్వే స్టేషన్లలో ఉన్న సీసీటీవీ కెమెరాల నిఘాను మరింత బలోపేతం చేయడంతో పాటు, సాంకేతికత ఆధారిత పర్యవేక్షణను పెంచాలని స్పష్టం చేశారు. అనుమానాస్పద కదలికలను గుర్తించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా నేరాలను ముందుగానే అడ్డుకునే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
రైళ్లలో దొంగతనాలు, జేబుదొంగతనాలను అరికట్టేందుకు పోలీసుల గస్తీని పెంచాలని డీజీపీ ఆదేశించారు. ముఖ్యంగా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే రైళ్లు, స్టేషన్లలో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. ప్రయాణికుల భద్రతకు సంబంధించిన అంశాల్లో రక్షణ చర్యలను మరింత మెరుగుపరచాలని కూడా అధికారులకు సూచించారు. రైలు ప్రయాణ సమయంలో ప్రయాణికులు తమ సమస్యలను వెంటనే పోలీసులకు తెలియజేసే విధంగా వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు.
నేరాల నియంత్రణలో ఆధునిక సాంకేతికతను మరింత సమర్థంగా ఉపయోగించుకోవాలని డీజీపీ సూచించారు. ‘సుదర్శన్’, ‘గాంధీవ్’, నాట్గ్రిడ్ లాంటి ఆధునిక సాఫ్ట్ వేర్, సమాచార వ్యవస్థలను ఉపయోగించాలని అధికారులకు సూచించారు. ఈ సాంకేతిక సాధనాల ద్వారా నేరాలకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించడం, అనుమానితుల కదలికలను గుర్తించడం, వివిధ కేసులకు సంబంధించిన సమాచారాన్ని అనుసంధానం చేయడం వంటి పనులు వేగంగా నిర్వహించే అవకాశం ఉంటుంది.
రైల్వే మార్గాల ద్వారా మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడంపై కూడా సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు. అనుమానాస్పదంగా కనిపించే ప్రయాణికులు, వారి సామానులను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. కేవలం డ్రగ్స్ ను స్వాధీనం చేసుకోవడంతో ఆగకుండా, వాటి వెనుక ఉన్న సరఫరా నెట్ వర్క్ ను గుర్తించాలని సూచించారు. మాదకద్రవ్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరికి చేరుతున్నాయి? అనే అంశాలపై దర్యాప్తును విస్తరించి అసలు నెట్ వర్క్ ను ఛేదించాలని అధికారులకు సూచించారు. అంతర్రాష్ట్ర ముఠాలపై చర్యలు తీసుకునే సమయంలో ఇతర రాష్ట్రాల పోలీసు విభాగాలతో సమన్వయం చేసుకోవాలని కూడా ఆదేశించారు. అవసరమైన చోట ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించి డ్రగ్స్ అక్రమ రవాణా గొలుసును పూర్తిగా అడ్డుకోవాలని సూచించారు. AI, సీసీటీవీ, ఆధునిక సాఫ్ట్ వేర్ తో పాటు పోలీసుల గస్తీని పెంచడం ద్వారా పశ్చిమ రైల్వే పరిధిలో ప్రయాణికులకు మరింత భద్రత కల్పించడమే లక్ష్యంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
Read Also: హోటళ్లలో Wi-Fi వాడుతున్నారా? అయితే.. మీ వీడియోలు బయటకొస్తాయ్!